పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ ఎలిగేడు: తాష్కెంట్(ఉజ్బెకిస్థాన్) వేదికగా ఈ నెల 29 నుంచి మొదలయ్యే ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీకి రాష్ట్ర యువ ఆర్చర్ తానిపర్తి చికీత ఎంపికైంది. ఈ మేరకు భారత ఆర్చరీ అసోసియేషన్(ఏఏఐ) గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్న ఈ పెద్దపల్లి యువ ఆర్చర్ ఆసియా కప్లో మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగనుంది.
కాంపౌండ్ కేటగిరీలో చికీతతో పాటు ప్రగతి, రాగిణి, పర్నీత్కౌర్ పోటీపడుతున్నారు. టోర్నీలో కాంపౌండ్ విభాగంతో పాటు రికర్వ్లో భారత ఆర్చర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికీత 2018లో ఆర్చరీ కెరీర్ను ప్రారంభించింది. మరుసటి ఏడాది గోవాలో జరిగిన జాతీయ స్థాయి టోర్నీలో చికీత పసిడి పతకంతో మెరిసింది. 2022లో బెంగళూరులో జరిగిన నేషనల్ లెవల్ టోర్నీలోనూ స్వర్ణం సొంతం చేసుకుంది.
జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న 32 మంది ప్లేయర్లను ఎంపిక చేయగా, అందులో తెలంగాణ నుంచి చికీత ఎంపికైంది. కాంపౌండ్ విభాగంలో తెలుగు రాష్ర్టాల నుంచి తొలిసారి పతకం సాధించి ఆకట్టుకుంది. ఈ మధ్యే ఆసియా కప్ టోర్నీ కోసం ఢిల్లీలో నిర్వహించిన ట్రయల్స్ ద్వారా ఈ యువ ఆర్చర్ను భారత జట్టుకు ఎంపిక చేశారు. ప్రతిష్ఠాత్మక టోర్నీకి చికీత ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఉమ్మడి కరీంనగర్ ఆర్చరీ సంఘం కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, డీ శ్రీనివాస్ అభినందించారు.