అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే విశ్వక్రీడలకు అర్హత సాధించారు. మహిళల 57 కేజీల విభాగంలో మూడు బౌట్లలో అలవోకగా నెగ్గి 19ఏండ్ల అన్షు తుదిపోరులో అడుగుపెట్టింది. 62కేజీల విభాగం సెమీస్లో 0-6తో వెనుకబడిన సమయంలో సోనమ్ ఒక్కసారిగా విజృంభించి సిన్ పింగ్పై (తైపీ) తొమ్మిది పాయింట్లు సాధించి టోక్యో టికెట్ పట్టేసింది. అన్షు విశ్వక్రీడలకు అర్హత సాధించడంతో రియో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్కు టోక్యో తలుపులు మూసుకుపోయాయి. ఇదివరకే మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (53 కేజీలు) ఒలింపిక్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.