ICC Champions Trophy 2025: ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఫీవర్లో ఉన్న అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. 2025లో పాకిస్తాన్లో జరుగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చే ఈ మెగా టోర్నీకి ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో భాగంగా టాప్-7 జట్లు అర్హత సాధిస్తాయని తెలిపింది. అయితే ఈ ప్రకటనతో మరోసారి దాయాది దేశాల క్రికెట్ బోర్డులు ఢీ అంటే ఢీ అననున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల ముగిసిన ఆసియా కప్లో ఆడేందుకే పాకిస్తాన్కు వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు వెళ్తుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..!
ఆదివారం ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘2025లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య హోదాలో ఉన్న పాకిస్తాన్తో పాటు 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసేనాటికి టాప్ – 7లో ఉన్న జట్లు అర్హత సాధిస్తాయి. దీనికి ఐసీసీ బోర్డు 2021 నవంబర్లోనే ఆమోదముద్ర వేసింది..’ అని వెల్లడించింది. తాజా ప్రకటనతో మరోసారి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య రసవత్తర పోరు సాగడం ఖాయం.
ఆసియా కప్లో లొల్లి..
కొద్దిరోజుల క్రితమే పాకిస్తాన్.. ఈ ఏడాది ఆసియా కప్కు ఆతిథ్యమిచ్చింది. అయితే బీసీసీఐ మాత్రం.. రోహిత్ సేనను పాకిస్తాన్కు పంపేది లేదని తేల్చి చెప్పింది. తటస్థ వేదికలు అయితేనే ఆడతామని లేకుంటే టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కూడా సిద్ధమన్న సంకేతాలు ఇచ్చింది. గతేడాది టీ20 ప్రపంచకప్ కు ముందు బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన ప్రకటనతో మొదలైన ఈ రగడ.. ఇరు బోర్డుల విమర్శలు, ప్రతివిమర్శలు, చర్చోపచర్చల మధ్య హాట్హాట్గా సాగింది. చివరికి భారత్ కోరినట్టుగానే భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకకు మార్చింది పీసీబీ. ఇదే కారణంగా తాము కూడా ప్రపంచకప్లో భారత్కు రాబోమని, తమకూ తటస్థ వేదికలు కావాలని భంగపడ్డది.
ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తుందా..?
ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు వెళ్తుందా..? అన్నది అనుమానమే. భద్రతపరంగా భారత జట్టుకు వచ్చిన నష్టమేమీ లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను తాము భారత జట్టుకు అందజేస్తామని చెప్పినా బీసీసీఐ ససేమిరా ఒప్పుకోలేదు. మరి ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుంటుందా..? చేసుకున్నా కనుసైగతో ప్రపంచ క్రికెట్ను శాసించే బీసీసీఐ అందుకు తలొగ్గుతుందా..? అన్నవి ప్రస్తుతానికైతే సమాధానం దొరకని ప్రశ్నలే. మొన్నటిదాకా ఆసియా కప్ గురించి నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న బీసీసీఐ, పీసీబీలు ఇకనుంచి ఛాంపియన్స్ ట్రోఫీపై వాదులాడుకోనున్నాయి.