హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్గా డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆంజనేయగౌడ్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్రీడామంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్లేయర్లు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, పాలమూరు వాసుల రాకతో ఎల్బీ స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు కవిత, ప్రకాశ్, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘పాలమూరులోని ఒక మారుమూల గ్రామంలో పేద కుటుంబం నుంచి వచ్చాను.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచాను. నా పనితీరు మెచ్చి తొలుత బీసీ కమిషన్లో సభ్యుడిగా, ఇప్పుడు సాట్స్ చైర్మన్గా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాను. కుగ్రామం నుంచి వచ్చిన నాకు గ్రామీణ ప్రాంత ప్లేయర్ల కష్టనష్టాలు ఏంటో బాగా తెలుసు. గ్రామాల్లో క్రీడా అభ్యున్నతి శక్తివంచన లేకుండా పనిచేస్తాను. కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పాటుపడుతాను. భవిష్యత్లో నిఖత్జరీన్, ఇషాసింగ్ లాంటి ప్లేయర్లు మరింత వెలుగులోకి వస్తారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత సహాయ, సహకారాలతో మరింత ముందుకెళ్తాను’ అని అన్నారు. సాట్స్ చైర్మన్కు మంత్రులు శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, చీఫ్ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, సుభాష్రెడ్డి, క్రాంతికిరణ్, జోగు రామన్న తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
సాట్స్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న ఆంజనేయగౌడ్