Hanuma Vihari : క్రికెటర్ హనుమా విహరి(Hanuma Vihari), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రికెస్ అసోసియేషన్ తాజాగా విహరికి షోకాజ్ నోటీస్ పంపింది. అర్థాంతరంగా కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో పాటు భవిష్యత్లో ఆంధ్రాకు ఆడనని చెప్పడానికి కారణం ఏంటో చెప్పాలని ఆదేశించింది. ఈ విషయాన్ని మరింత పెద్దది చేయకూడదని ఏసీఏ భావిస్తోందని ఏసీఏ అధికారి ఒకరు తెలిపారు.
‘గత నెలలో విహరి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశాడో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పటివరకూ అతడు మమ్మల్ని కాంటాక్ట్ కాలేదు. అతడు ఏమైనా చెప్పదలచుకునేందుకు ఇదొక మంచి అవకాశం. ఆంధ్రా క్రికెట్కు విహరి చేసిన సేవను మేము గుర్తిస్తున్నాం. అతడు దేశవాళీలో పలు స్థానాల్లో ఆడాడు’ అని సదరు అధికారి చెప్పాడు.
ఆస్ట్రేలియాలో 2021-22లో భారత జట్టు టెస్టు సిరీస్ నెగ్గడంలో విహరి కీలక పాత్ర పోషించాడు. అయితే.. గాయం కారణంగా ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అయితే.. దేశవాళీలో ఆంధ్రా క్రికెట్ జట్టు(Andhra Cricket Team) తరఫున సంచలన ప్రదర్శన చేశాడు. కానీ, అనూహ్య పరిస్థితుల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు భవిష్యత్లో ఆంధ్రా జట్టుకు ఆడనని వెల్లడించాడు. ‘
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నన్ను ఎంతో వేధనకు గురి చేసింది. నా ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసింది. ఓ రాజకీయ నాయకుడి కుమారుడి కోసం నన్ను బలి చేశారు’ అని విహరి తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. దాంతో, ఆంధ్రా క్రికెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రా జట్టు ఓడిపోయింది. మధ్యప్రదేశ్ చేతిలో 4 పరగుల తేడాతో పరాజయం పాలైంది. ఈమ్యాచ్ అనంతరం విహరి తాను ఆంధ్రా జట్టును వీడుతున్నట్టు పోస్ట్ పెట్టాడు. రాజకీయ బలమున్న పృథ్వీ రాజ్కు వత్తాసు పలికి తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆదేదనకు గురయ్యాడు. విహరి ఆంధ్రా తరఫున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అంతకంటే ముందు అతడు హైదరాబాద్కు ఒక సీజన్ మొత్తం ప్రాతినిధ్యం వహించాడు.