Chetan Sharma | న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో అలజడి చెలరేగింది. చీఫ్ సెలెక్టర్ పదవికి మాజీ క్రికెటర్ చేతన్శర్మ రాజీనామా చేశాడు. ఒక చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భారత క్రికెట్కు సంబంధించి రహస్య సమాచారాన్ని వెల్లడించడం శర్మ పదవికి ఎసరు తీసుకొచ్చింది. స్టింగ్ ఆపరేషన్తో బీసీసీఐ పరువుపోయిన నేపథ్యంలో తన పదవికి శుక్రవారం శర్మ అనూహ్యంగా రాజీనామా చేయగా, బీసీసీఐ కార్యదర్శి జై షా వెంటనే ఆమోదం తెలిపాడు. దీంతో శర్మ స్థానంలో ఎస్ఎస్ దాస్ బీసీసీఐ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించే అవకాశముంది. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు త్వరలో టీమ్ఇండియాను ఎంపిక చేయనున్న నేపథ్యంలో చేతన్శర్మ రాజీనామా చేయడం అనూహ్య పరిణామాలకు దారితీసింది.
ఒక జాతీయ మీడియా చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ భారత క్రికెట్లో జరుగుతున్న అంతర్గత విషయాలు బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న చేతన్శర్మ క్రికెటర్ల ఎంపిక, ప్లేయర్ల ఫిట్నెస్, బోర్డు అంతర్గత వ్యవహారాలను స్టింగ్ ఆపరేషన్లో చెప్పడం దీనికి కారణమైంది. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటపెట్టడం ఒక రకంగా భారత క్రికెట్ పరువు తీసింది. ముఖ్యంగా ప్లేయర్లు 80-85 శాతం ఫిట్నెస్ ఉన్నా..ఉత్ప్రేరకాలు(ఇంజెక్షన్ల)తో జట్టులోకి వస్తున్నారని, విరాట్ కోహ్లీ, రోహిత్శర్మ మధ్య అసలు పొసగదని, సౌరవ్ గంగూలీతో విబేధాల కారణంగానే కోహ్లీ కెప్టెన్సీ పోయిందని, హార్దిక్ పాండ్యా, ఉమేశ్యాదవ్, దీపక్ హుడా తరుచూ తన ఇంటికి వస్తారని శర్మ చానల్తో చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్లో తొలి హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్గా పేరొందిన చేతన్శర్మ..ఇలా స్టింగ్ ఆపరేషన్లో దొరకడం అతనికి మాయని మచ్చగా మిగిలిపోనుంది.