Spot Fixing | అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని తనపై ఒక భారతీయ వ్యాపారి ఒత్తిడి చేశాడని జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ సారధి బ్రెండన్ టేలర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ ఘటన 2019 అక్టోబరులో జరిగిందని టేలర్ చెప్పాడు. అప్పట్లో జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ఆరు నెలలుగా జీతం ఇవ్వలేదు.
బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోలేకపోయిన కారణంగా.. ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం విధించాలని ఐసీసీ ఆలోచిస్తున్న రోజులవి. అలాంటి సమయంలో ఒక భారతీయ వ్యాపారి తనను సంప్రదించినట్లు టేలర్ వెల్లడించాడు.
జింబాబ్వేలో ఒక టీ20 టోర్నీని స్పాన్సర్ చేస్తానని ఆ వ్యాపారి చెప్పాడట. దీనిపై చర్చించేందుకు భారత్కు రావాలని టేలర్ను సదరు వ్యాపారి ఆహ్వానించాడు. దారి ఖర్చుల కోసం 15 వేల డాలర్లు కూడా ఇచ్చాడు. ‘‘ఆ పరిస్థితుల్లో నా మనసు కొంచెం చలించింది. ఆరు నెలలుగా జీతాల్లేని పరిస్థితిలో నేను భారత్ వెళ్లాను’’ అని టేలర్ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
అక్కడకు వెళ్లిన తర్వాత చర్చలు జరిగాయని, చివరి రోజు అదే వ్యాపారి చర్చలు సక్సెస్ అయినందుకు పార్టీకి పిలిచాడని చెప్పాడు. అక్కడ అందరూ మద్యం తాగారని, కొకైన్ తీసుకున్నారని వివరించాడు. తనకు కూడా ఒకరు కొకైన్ ఇస్తే తీసుకున్నాన్నాడు.
‘‘ఆ మరుసటి రోజు నన్ను ఆహ్వానించిన భారతీయ వ్యాపారి హోటల్ గదికి వచ్చి, రాత్రి పార్టీలో జరిగిన సంఘటన వీడియో చూపించాడు. వాళ్లు చెప్పినట్లు అంతర్జాతీయ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్ చేయకపోతే వీడియో సోషల్ మీడియాలో పెడతానన్నారు’’ అని టేలర్ తనకు జరిగిన అనుభవాన్ని చెప్పాడు.
ఇలా బ్లాక్మెయిల్స్ వచ్చినప్పటికీ తాను క్రికెట్లో ఎప్పుడూ ఫిక్సింగ్కు పాల్పడలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఈ వివరాలన్నీ చెప్పినందుకు ఐసీసీ తనపై రెండేళ్లు నిషేధం విధించనుందని, తను ఆ శిక్షను శిరసా వహిస్తానని చెప్పాడు. యువ ఆటగాళ్లు ఇలాంటి ప్రలోభాలకు దూరంగా ఉండాలని హితబోధ చేశాడు.