కెరీర్ లో అత్యంత పేలవ ఫామ్ తో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు రాహుల్ ద్రావిడ్, తాను కూడా కెరీర్ లో ఇలాంటివి ఎదుర్కున్నామని దాదా చెప్పాడు.
గంగూలీ మాట్లాడుతూ… ‘ఒకసారి మీరు అంతర్జాతీయ క్రికెట్ లో ఇన్నాళ్లుగా అతడు చేసిన పరుగులు చూడండి. రన్స్ చేయగల సామర్థ్యం, నైపుణ్యం లేకుండానే అతడు ఇంతకాలం ఆడాడా..? కోహ్లీ ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. ఆ విషయం అతడికీ తెలుసు. కానీ కోహ్లీ త్వరలోనే తిరిగి మునపటి ఫామ్ ను అందుకుంటాడు. మళ్లీ మనం పాత కోహ్లీని చూస్తామన్న నమ్మకం నాకుంది.. ’ అని చెప్పాడు.
ఒక ఆటగాడిగా కెరీర్ లో ఎత్తుపల్లాలు చూడటం సహజమేనని ఎంత దిగ్గజ క్రికెటర్ అయినా దాన్నుంచి తప్పించుకోలేడని దాదా అన్నాడు.‘క్రీడల్లో ఇలాంటివి సహజం. కెరీర్ లో ఏ ఆటగాడూ ఈ దశను దాటకుండా ఉండలేడు. సచిన్, ద్రావిడ్ తో పాటు నేనూ ఆ దశను దాటి వచ్చినవాళ్లమే. ఇప్పుడు కోహ్లీ అదే దశను ఎదుర్కుంటున్నాడు. ఇది కోహ్లీ తోనే ఆగేది కాదు. భవిష్యత్ లో మరో ఆటగాడు కూడా ఇలాంటి దశను దాటాల్సిందే. ఒక క్రీడాకారుడు అన్నింటినీ వినాలి (కోహ్లీ పై వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ). వాళ్ల ఆట ఆడుకుంటూ పోవాలి..’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.