హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘డిస్ట్రిక్ట్ అకాడమీస్ డెవలప్మెంట్ ప్లాన్’ను తీసుకువస్తున్నట్లు హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి, క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు సోమవారం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆటగాళ్లకు సమాన అవకాశాలు కల్పించేలా జగిత్యాల, నాగర్కర్నూల్, సూర్యాపేట, జహీరాబాద్లో నాలుగు డిస్ట్రిక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లను హెచ్సీఏ నిర్మిస్తుందన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ కేంద్రాల్లో అకాడమీ గ్రౌండ్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన ప్రతి కేంద్రంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. ఈ అకాడమీల నిర్వహణ కోసం నాణ్యమైన కోచ్లు, గ్రౌండ్ స్టాఫ్ను నియమిస్తామని తెలిపారు. మొదట ఓపెన్ ట్రయల్స్ ద్వారా జిల్లాల్లోని ప్రతిభావంతులను ఎంపిక చేసి, జిల్లా అకాడమీల్లో శిక్షణ ఇస్తామని, అక్కడ రాణించే ప్లేయర్లను సీఓఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్కు ప్రమోట్ చేస్తామని చెప్పారు.
భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ను హెచ్సీఏ జట్లకు మెంటార్గా ఎంపిక చేసినట్టు అంబటి రాయుడు ప్రకటించాడు. రెండేండ్ల పాటు హైదరాబాద్ రంజీ, ఏజ్ గ్రూప్స్ టీమ్స్కు మార్గనిర్దేశం చేస్తాడని తెలిపాడు.
హెచ్సీఏలో నిబంధనల ఉల్లంఘనలు, పాలనాపరమైన లోపాలపై బీసీసీఐ అంబుడ్స్మన్ నోటీసులు జారీ చేశారు. బోర్డు రాజ్యాంగంతో పాటు సుప్రీంకోర్టు ఆమోదించిన పాలనా మార్గదర్శకాలను ఉల్లంఘించిందంటూ మాజీ క్రికెటర్ గౌరవ్ శర్మ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించి నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని హెచ్సీఏను ఆదేశించారు.