హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్నాథ్ను హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్మన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సురేశ్కుమార్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ అమర్నాథ్ కోర్టును ఆశ్రయించారు.
హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో జగన్మోహన్రావు చేతిలో ఒక ఓటు తేడాతో అమర్నాథ్ ఓటమిపాలయ్యారు. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తూ శ్రీచక్ర క్లబ్ నుంచి జగన్మోహన్ ఎంపిక కావడంపై కోర్టు తీర్పును అనుసరించి రెండో స్థానంలో నిలిచిన అమర్నాథ్ను హెచ్సీఏ చీఫ్గా నియమిస్తూ అంబుడ్స్మన్ నిర్ణయం తీసుకున్నారు.
అంబుడ్స్మన్ సురేశ్కుమార్ ఆదేశాలకు అనుగుణంగా అమర్నాథ్ సోమవారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. చాలా రోజుల వరకు అధ్యక్ష పదవి ఖాళీగా ఉండరాదన్న ఉద్దేశంతో అంబుడ్స్మన్ సురేశ్కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అమర్నాథ్ పేర్కొన్నారు.