అందుబాటులో ఉన్న స్లాట్లు 77 l పోటీపడుతున్న ఆటగాళ్లు 333 ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్లోని పది ఫ్రాంచైజీలు 77 స్థానాల కోసం ఆటగాళ్లను ఎంపిక చేసుకోనుండగా.. 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల వన్డే ప్రపంచకప్లో సంచలన ప్రదర్శన చేసిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్తో పాటు పాతకాపులు మిషెల్ స్టార్క్, కమిన్స్ కోసం కోట్లు పెట్టేందుకు ప్రాంఛైజీలు రెడీ అయిపోయాయి. మరి ఈ సారి జాక్పాట్ కొట్టేదెవరో తెలియాలంటే మరికాసేపు వేచి చూడాల్సిందే!
IPL Auction | దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 17కు ముందు మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. ట్రేడింగ్లోనే పలువురు ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారగా.. ఇప్పుడు మిగిలిన 77 స్థానాల కోసం మంగళవారం దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా.. 333 మంది పేర్లను షార్ట్లిస్ట్ చేశారు. అందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 116 మంది జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించినవారు కాగా.. మిగిలిన 215 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వేలంలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 77 స్లాట్లలో 30 విదేశీ ప్లేయర్లతో భర్తీ చేయనున్నారు. విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుండటం ఇదే తొలిసారి కాగా.. ఇటీవల మహిళల ఐపీఎల్ నిర్వహించిన మల్లికా సాగర్ వేలాన్ని నిర్వహించనుంది.
77 స్థానాలు.. 262 కోట్లు
మొత్తం 10 జట్లు ఈ వేలంలో పాల్గొననుండగా.. ఫ్రాంచైజీల వద్ద రూ.262.95 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా రూ.38.15 కోట్లు, అత్యల్పంగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.15 కోట్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 34 కోట్లు ప్యాకెట్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఎవరిని ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరం. వన్డే వరల్డ్కప్లో దుమ్మురేపిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, మధుషనక, స్టార్క్, కమిన్స్పై కనక వర్షం కురవడం ఖాయమే. ట్రేడింగ్లో హార్దిక్ పాండ్యాను దక్కించుకున్న ముంబై ఇండియన్స్ రూ.17.75 కోట్లు వేలంలో ఖర్చు పెట్టనుంది. రూ.32.7 కోట్లు అందుబాటులో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 12 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే చాన్స్ ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆరు స్లాట్లు ఖాళీగా ఉండగా.. అందులో ముగ్గురు విదేశీ ప్లేయర్లను ఎంపిక చేసుకోనుంది.
ఉమేశ్, శార్దూల్, హర్షల్కు గిరాకీ
23 మంది ఆటగాళ్లకు కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి రానున్నారు. అందులో స్టార్క్, హెడ్తో పాటు ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నారు. మరో 13 మంది ప్లేయర్లు తమ కనీస ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్ ప్లేయర్లు స్టోక్స్, రూట్, ఆర్చర్తో పాటు షకీబ్, లిటన్, కేదర్ జాదవ్ ఈ వేలంలో అందుబాటులో లేరు. ఎనిమిదేండ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేస్తున్న స్టార్క్ కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. అండర్-19 స్థాయిలో రాణిస్తున్న ఆల్రౌండర్ అర్షిన్ కులకర్ణి పంటపండే అవకాశం లేకపోలేదు. అన్నీ జట్లు దేశవాళీ పేసర్లపై భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో.. ఉమేశ్, శార్దూల్, హర్షల్కు గిరాకీ బాగా కనిపిస్తున్నది.
తెలుగు ఆటగాళ్లకు చాన్స్ దక్కేనా
హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోగా.. ఈ సారి వేలంలో.. తెలుగు ఆటగాళ్లు హనుమ విహారి, కేఎస్ భరత్తో పాటు.. ఇటీవల అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన మురుగన్ అభిషేక్, అవినాశ్రావుపై ఎవరు ఆసక్తి కనబరుస్తారో చూడాలి. సుదీర్ఘ కాలంగా ఐపీఎల్ ఆడుతున్న అంబటి రాయుడు గత సీజన్తో రిటైర్మెంట్ ప్రకటించగా.. అతడి స్థానాన్ని చెనై సూపర్ కింగ్స్ మనీశ్ పాండేతో భర్తీ చేసే చాన్స్ ఉంది.