మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దుమ్మురేపింది. గెలిస్తే గానీ ప్లేఆఫ్ బెర్తు ఖరారు కానీ నేపథ్యంలో జూలు విదిల్చింది. గత మ్యాచ్లో పరుగు తేడాతో ఢిల్లీకి మ్యాచ్ చేజార్చుకున్న మందనసేన..డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎలీస్ పెర్రీ ఆరు వికెట్ల విజృంభణతో ముంబై 113 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యఛేదనలోనూ బ్యాటు ఝులిపించిన పెర్రీ.. రీచా ఘోష్తో కలిసి జట్టును ప్లేఆఫ్స్కు చేర్చింది. ఆల్రౌండ్ షోతో పెర్రీ ఆర్సీబీ విజయంలో కీలకమైంది.
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్లో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఐపీఎల్కు ఏ మాత్రం తీసిపోకుండా జరుగుతున్న లీగ్లో అమ్మాయిలు అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబైపై అద్భుత విజయం సాధించింది. దీని ద్వారా లీగ్లో తొలిసారి ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంది. ముంబై నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(40 నాటౌట్), రీచా ఘోష్(36 నాటౌట్) బెంగళూరును గెలిపించారు. షబ్నమ్, మాథ్యూస్, బ్రంట్కు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు పెర్రీ(6/15) ధాటికి ముంబై 19 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. సంజీవన్ సంజన(30), మాథ్యూస్(26) రాణించగా, మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. మంచి ఫామ్మీదున్న కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్(0) గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగింది. మిలోనిక్స్, డివైన్, శోభన, శ్రేయాంక ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఆరు వికెట్లకు తోడు అజేయంగా నిలిచిన పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
పెర్రీ ప్రదర్శన అదుర్స్: ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ స్మృతి మందన నమ్మకాన్ని ఆర్సీబీ బౌలర్లు నిలబెట్టారు. ముంబై ఓపెనర్లు మాథ్యూస్, సంజన మెరుగైన శుభారంభాన్ని ఇచ్చారు. డివైన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మాథ్యూస్..పెర్రీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో తొలి వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత 22 పరుగుల తేడాతో సంజన కూడా ఔట్ కావడంతో ముంబై కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు కుదురుగానే ముంబై..పెర్రీ రంగప్రవేశంతో సీన్ పూర్తిగా మారిపోయింది. వచ్చి రావడంతోనే సంజనను పెవిలియన్ పంపిన పెర్రీ..హర్మన్ప్రీత్కౌర్(0), అమెలియా కెర్(2), అమన్జ్యోత్కౌర్(4), పూజ వస్ర్తాకర్(6), బ్రంట్(10) వరుస విరామాల్లో పెవిలియన్ పంపి ముంబైని కోలుకోని దెబ్బ కొట్టింది. పెర్రీ పేస్ బౌలింగ్ ధాటికి ముంబై ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆఖర్లో ప్రియాంక(19 నాటౌట్) బ్యాటు ఝులిపించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో లీగ్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను పెర్రీ తన పేరిట లిఖించుకుంది. మరోవైపు ముంబై తమ రెండో అత్యల్ప స్కోరును మూటగట్టుకుంది.
పెర్రీ, రీచా నిలకడగా: ముంబై నిర్దేశించిన స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరకు మెరుగైన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ మందన(11), మిలోనెక్స్(9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ తరుణంలో పెర్రీ, రీచా ఘోష్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానెత్తుకున్నారు. ముఖ్యంగా పెర్రీ..తను అనుభవాన్ని ఉపయోగిస్తూ ముంబై బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంది. తన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, భారీ సిక్స్ కొట్టిన పెర్రీకి..రీచా చక్కని సహకారం అందించింది. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు రీచా కూడా చెలరేగడంతో బెంగళూరు గెలుపు సులువైంది.
1 డబ్యూపీఎల్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంఆర్సీబీకి ఇది తొలిసారి.
మంబైతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ పేసర్ ఎలీస్ పెర్రీ(6/15) ఆరు వికెట్లతో విజృంభించింది. లీగ్లో ఇది అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది.
ముంబై: 19 ఓవర్లలో 113 ఆలౌట్ (సంజన 30, మాథ్యూస్ 26, పెర్రీ 6/15, శ్రేయాంక 1/3),
బెంగళూరు: 15 ఓవర్లలో 115/3(పెర్రీ 40 నాటౌట్, రీచా 36 నాటౌట్, మాథ్యూస్ 1/11, బ్రంట్ 1/18)