లక్ష్యసేన్, శ్రీకాంత్, సింధు పైనే ఆశలు
నేటి నుంచి ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్
21 ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ను దక్కించుకునేందుకు భారత స్టార్ షట్లర్లు సమాయత్తమవుతున్నారు. ప్రకాశ్ పదుకోన్, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆ ఘనత సాధించిన ప్లేయర్గా నిలిచేందుకు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్
అస్త్రశస్ర్తాలతో మెగాటోర్నీ బరిలో దిగుతున్నారు!
బర్మింగ్హామ్: రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీని ఈసారైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత షట్లర్లు మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ భారీ అంచనాల మధ్య అడుగు పెడుతున్నారు. తాజా టోర్నీల్లో చక్కటి ప్రదర్శనతో లక్ష్యసేన్ దుమ్మురేపుతుండగా.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత శ్రీకాంత్ సత్తాచాటేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రకాశ్ పదుకోన్ (1980), పుల్లెల గోపీచంద్ (2001) టైటిల్స్ నెగ్గగా.. 21 ఏండ్లుగా మరే ఆటగాడు విజేతగా నిలువలేకపోయాడు. 2015లో ఫైనల్ చేరడం ద్వారా సైనా నెహ్వాల్ ఆశలు రేపినా.. రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ప్రతిసారీ ఫేవరెట్గా అడుగుపెడుతున్న పీవీ సింధు.. ఇప్పటి వరకు ఈ టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. సింధు ఆరో సీడ్గా బరిలోకి దిగుతుండగా.. గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం, ఇండియా ఓపెన్ టైటిల్, జర్మన్ ఓపెన్ రన్నరప్ ఇలా గత మూడు టోర్నీల్లో లక్ష్యసేన్ దుమ్మురేపాడు. అదే జోష్లో సూపర్-1000 ఈవెంట్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు. కిడాంబి శ్రీకాంత్ కూడా మంచి టచ్లో ఉండగా.. పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సింధు సిద్ధం
జర్మన్ ఓపెన్ రెండో రౌండ్లో తనకంటే బలహీన ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైన సింధు.. మెగాటోర్నీలో రాణించాలని తహతహలాడుతున్నది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ వాంగ్ జీ యీ (చైనా)తో సింధు తలపడనుంది. అంతా అనుకున్నట్లు సాగితే క్వార్టర్ ఫైనల్లో సింధుకు రెండో సీడ్ అకానే యామగుచి (జపాన్) ఎదురయ్యే అవకాశాలున్నాయి. మరో భారత స్టార్ సైనా నెహ్వాల్.. తొలి రౌండ్లో ప్రపంచ పదో ర్యాంకర్ పోర్న్పవీ చొచువాంగ్ (థాయ్లాండ్)తో పోటీ పడనుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, ధ్రువ్-అర్జున్.. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని జోడీలు బరిలోకి దిగనున్నాయి.