Mumbai Indians : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) చాంపియన్ ఆటతో రెండో విజయం నమోదు చేసింది. టాపార్డర్లో ఇషాన్ కిషన్(69) చితక్కొట్టుడుకు.. సూర్యకుమార్ యాదవ్ (52) మెరుపులు తోడవ్వడంతో గురువారం వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వరుసగా రెండో విక్టరీ కొట్టిన ముంబై జట్టుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టులో ఎవరూ సెంచరీ కొట్టాలని అనుకోరని, వచ్చిన వాళ్లు వచ్చినట్టు ఉతికేస్తారంతే అని చోప్రా అన్నాడు.
‘ఐపీఎల్ జట్లలో ముంబై తీరే వేరు. ఆ జట్టులో ఎవరూ వంద కొట్టాలని ఆశపడరు. క్రీజులోకి వచ్చామా? ఉతికామా? అన్నదే వాళ్ల లెక్క. ఎందుకంటే ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ విధ్వంసక ఆటగాళ్లు ఉన్నారు. ముంబై ఆటగాళ్లు ఎంతలా చెలరేగుతారంటే.. ప్రత్యర్థి జట్టు భయపడేంతలా’ అని చోప్రా తెలిపాడు.
ఆకాశ్ చోప్రా, హార్దిక్ పాండ్యా
గురువారం వాంఖడేలో ముంబై చిచ్చరపిడుగులు ఆర్సీబీకి ముచ్చెమటలు పట్టించారు. తొలుత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా (21/5) నిప్పులు చెరిగాడు. 197 పరుగుల ఛేదనలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69 రన్స్) సుడిగాలిలా చుట్టేయగా.. ఆ తర్వాత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52 పరుగులు) బౌండరీల వర్షం కురిపించాడు.
काय मग? मज्जा आली का? 😎💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvRCB pic.twitter.com/80HfcaukpW
— Mumbai Indians (@mipaltan) April 11, 2024
సూర్య ఆడింది 19బంతులే అయినా చేయాల్సిన నష్టమంతా చేసేసి డగౌట్కు వెళ్లాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 నాటౌట్), తిలక్ వర్మ(16 నాటౌట్)లు సైతం ధనాధన్ ఆడి 99 బంతుల్లోనే ముంబైకి విక్టరీ అందించారు. సొంతమైదానంలో భీకర ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పాండ్యా సేన ఏప్రిల్ 14న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.