Ajit Agarkar : వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా(Team India)కు ఆసియా కప్(Asia Cup 2023) ఎంత కీలకమో తెలిసిందే. అందుకని బీసీసీఐ కీలక ఆటగాళ్లను ఈ టోర్నీకి ఎంపిక చేసింది. ఈరోజు ప్రకటించిన 18 మంది స్క్వాడ్లో కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)లకు చోటు దక్కింది. దాంతో, ప్రపంచ కప్ జట్టుపై ఓ స్పష్టత వచ్చిందని చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) కూడా దాదాపు ఇదే మాట చెప్పాడు. ఆసియా కప్ బృందంలోని కొందరు ప్రపంచ కప్ జట్టులో ఉండే అవకాశం ఉందని అన్నాడు.
‘ఆసియా కప్ కోసం 18 మందిని ఎంపిక చేశాం. వరల్డ్ కప్ బృందాన్ని వీళ్ల నుంచే ఎంపిక చేస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. శుభవార్త ఏంటంటే..? గాయం నుంచి కోలుకున్న కీలకమైన ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చారు. వాళ్లు మునపటిలా చెలరేగుతారని ఆశిస్తున్నా. వరల్డ్ కప్ జట్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది. సెప్టెంబర్ 5 వరకు డెడ్లైన్ ఉంది. ఆసియా కప్ తర్వాత చిన్న క్యాంప్, కొన్ని మ్యాచ్లు ఆడించాక వరల్డ్ కప్ స్క్వాడ్ను వెల్లడిస్తాం’ అని అగార్కర్ తెలిపాడు.
రాహుల్, శ్రేయాస్ అయ్యర్
ఈ ఏడాది ఆక్టోబర్ 5న భారత గడ్డపై ప్రపంచ కప్ జరుగనుంది. దాంతో ఆసియా కప్తో జట్టు కూర్పుపై స్పష్టత రానుంది. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు? అనేది తేలిపోనుంది. ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ పోటీలకు శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆగస్టు 30న టోర్నీ మొదలవ్వనుంది. నిరుడు పాక్ చేతిలో ఓటమితో ఇంటిదారి పట్టిన భారత జట్టు ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రాకతో మిడిలార్డర్ సమస్య తీరినట్టే అనిపిస్తోంది.
భారత బృందం : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయష్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సంజూ శామ్సన్.