Virat Kohli | వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో పోరులో విరాట్ కోహ్లీ తన బౌలింగ్తో అభిమానులను అలరించిన నేపథ్యంలో అజిత్ అగార్కర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. మెగాటోర్నీ ప్రారంభానికి ముందు ఏర్పాట్లు చేసిన సమావేశంలో సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా అగార్కర్ ఓ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్కప్లో అవసరమైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బంతితోనూ సత్తాచాటుతారు అని అగర్కార్ అప్పుడు చెప్పగా.. ఇప్పుడు కోహ్లీ దాన్ని ఆచరణలో చూపాడు.
పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. గాయంతో మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్కు బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను సమర్థవంతంగా పూర్తి చేసిన కోహ్లీ.. కేవలం రెండే పరుగులు ఇచ్చాడు. వేసింది మూడు బంతులే అయినా.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. విరాట్ బౌలింగ్ సంబంధించిన వీడియోలు, ఫొటోలే చక్కర్లు కొడుతున్నాయి. ఇక మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులైతే.. విరాట్తో పాటు రోహిత్ కూడా బౌలింగ్ చేస్తే చూడాలని ఉంది అనే ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఆరేండ్ల తర్వాత..
విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు బౌలింగ్ చేయడం కొత్త కాకపోయినా.. ఇటీవలి కాలంలో అతడు కేవలం బ్యాటింగ్పైనే దృష్టి పెట్టి బౌలింగ్కు దూరమయ్యాడు. వన్డేల్లో 4 వికెట్లు ఖాతాలో వేసుకున్న విరాట్ గతంలో వరల్డ్కప్ వంటి మెగాటోర్నీల్లో బౌలింగ్తో అలరించాడు. ముఖ్యంగా 2011లో వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మెగా ఫైనల్లోనూ కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఓవారల్గా వన్డేల్లో 4, టీ20ల్లో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్న విరాట్ బౌలింగ్తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.