Ajinkya Rahane : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) కోసం ఇంగ్లండ్లో సాధన చేస్తున్న టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్కు ముందు బీసీసీఐ టీవీ(BCCI TV)తో అతను మాట్లాడాడు. గతంలో ఏం జరిగింది? అది మంచా, చెడా అని ఆలోచించనని అన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఆడినట్టే ఫైనల్లోనూ చెలరేగుతానని తెలిపాడు.
‘దాదాపు 18 నెలల తర్వాత జట్టులోకి వచ్చాను. ఐపీఎల్ కంటే ముందు దేశవాళీ(Domestic)లో పరుగులు సాధించాను. భారత జట్టుకు మళ్లీ ఎంపికవ్వడంతో చాలా సంతోషించా. జట్టులో చోటు కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డా. అప్పుడు ఫ్యామిలీ ఎంతో సపోర్టు చేసింది. ఫిట్నెస్ కాపాడుకుని రంజీ ట్రోఫీలో ఆడాను. అక్కడ రాణించడంతో ఐపీఎల్లో చెన్నైకి ఆడే అవకాశం వచ్చింది. మళ్లీ నన్ను ఎంపిక చేసినందుకు బీసీసీఐ, సెలెక్టర్లకు ధన్యవాదాలు. గతంలో ఏం జరిగింది? అని ఆలోచించాలని అనుకోవడం లేదు.
The long pending happy frame!📸💛#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/icQWQUxwl4
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
కొత్తగా ఆటను ఆస్వాదించాలని అనుకుంటున్నా. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లో మాదిరిగానే డబ్ల్యూటీసీ ఫైనల్లో దూకుడుగా ఆడుతా. నా వరకు జట్టుకు కావాల్సినదంతా చేస్తాను’ అని రహానే చెప్పాడు. కెరీర్ ముగిసిపోయింది అనుకున్న దశలో భారత జట్టులోకి రహనే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఆడిన 82 టెస్టుల్లో ఈ మాజీ వైస్ కెప్టెన్ 4,931 రన్స్ కొట్టాడు.
16వ సీజన్లో రహానే చెలరేగాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను.. ముంబై ఇండియన్స్పై 27 బంతుల్లోనే 61 రన్స్ కొట్టి అందర్నీ షాక్కు గురిచేశాడు. ఫ్రాంచైజీ, కెప్టెన్ ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లోనూ 27 పరుగులతో రాణించాడు. ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు రవీంద్ర జడేజా సిక్స్, ఫోర్ బాదడంతో ధోనీసేన ఐదో సారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది.
ఓవల్ స్టేడియంలో జూన్ 7 -11 తేదీల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జరగనుంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తర్వాత తొలిసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్న టెస్టు ఇది. దాంతో, ఫైనల్ హోరాహోరీగా ఉండనుంది. 2021లో ఫైనల్ చేరిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ప్యాట్ కమిన్స సేనను భారత జట్టు ఓడించింది. దాంతో, ఫైనల్లో కూడా అదే ఫలితం రాబట్టాలని రోహిత్ బృందం భావిస్తోంది.