భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టిస్తూ.. థామస్ కప్ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు బ్యాడ్మింటన్ బృందాన్ని అభినందించారు. ఎయిరిండియా సంస్థ కూడా ఈ బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేసింది. దీనికి థామస్ కప్ విజేత అయిన చిరాగ్ శెట్టి సమాధానం ఇస్తూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
‘‘భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి అభినందనలు. ఈ విజయం మన దేశంలోని భావి క్రీడాకారుల కలలకు రెక్కలు తొడుగుతుంది’’ అని ఎయిరిండియా ట్వీట్ చేసింది. దీనిపై థామస్ కప్ విజేతలు స్పందించారు. కిదాంబి శ్రీకాంత్ ట్వీట్ చేస్తూ ఎయిరిండియాకు ధన్యవాదాలు తెలిపాడు.
అయితే మరో బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి మాత్రం తమాషాగా రిప్లై ఇచ్చాడు. ‘‘తిరిగి రావడానికి ఛార్టర్ ప్లేన్ దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అని చిరాగ్ అన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.