న్యూఢిల్లీ : అహ్మదాబాద్ ఐపీఎల్ ఫ్రాంఛైజ్ పేరును గుజరాత్ టైటాన్స్గా ఖరారు చేసినట్టు టీం ఓనర్ సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్కు చెందిన సిద్ధార్ధ్ పటేల్ బుధవారం వెల్లడించారు. టోర్నమెంట్లో కొత్తగా జోడించిన రెండు నూతన ఫ్రాంఛైజీల్లో ఇది ఒకటి. మరో ఫ్రాంచైజీగా లక్నో (సూపర్ జెయింట్స్) ముందుకొచ్చింది. గుజరాత్ టైటాన్స్ జట్టు సారధిగా ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చిన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరిస్తాడు.
అహ్మదాబాద్ టీంలో ఆప్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత యువ క్రికెటర్ శుభ్మన్ గిల్లకు కూడా చోటు దక్కింది. పాండ్యా, రషీద్లను రూ 15 కోట్లు చెల్లించి గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. గుజరాత్ నుంచి ఈ ఫ్రాంచైజీ తలపడటం ఇది రెండవసారి. అంతకుముందు 2016, 2017 సీజన్లలో గుజరాత్ లయన్స్ టోర్నీలో తలపడింది. అవినీతి ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్, రాజస్ధాన్ రాయల్స్ ను నిషేధించగా తొలి సీజన్లోనే సురేష్ రైనా సారధ్యంలోని గుజరాత్ లయన్స్ సత్తా చాటినా టైటిల్ను సాధించలేకపోయింది.
ఇక అహ్మదాబాద్ ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్, మెంటార్గా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ గ్యారీ కిర్స్టెన్ వ్యవహరిస్తారు. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్గా సేవలందిస్తారు. 2022 సీజన్లో టోర్నమెంట్లో పూర్తిస్ధాయి కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా కనిపించనున్నాడు. టీం లీడర్గా పాండ్యా ఆదర్శప్రాయంగా నిలుస్తాడని కిర్స్టెన్ చెప్పుకొచ్చాడు. యువ, నూతన కెప్టెన్గా హార్ధిక్ పాండ్యాతో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా వేచిచూస్తున్నానని అన్నాడు.