జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా మూడు పరాజయాల అనంతరం హైదరాబాద్ గెలుపు బాట పట్టింది. ఆదివారం జరిగిన పోరులో హైదరాబాద్ 30 పరుగుల తేడాతో (వీజేడీ పద్ధతిలో) విదర్భను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (102 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకోగా.. ధ్రువ్ షొరే (83) రాణించాడు.
మన బౌలర్లలో కార్తికేయ, నితిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (77 నాటౌట్), రాహుల్ సింగ్ (62 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. ఈ దశలో మ్యాచ్కు వరుణుడు ఆడ్డుపడగా.. హైదరాబాద్ లక్ష్యాన్ని 29 ఓవర్లలో 130 పరుగులుగా నిర్దేశించారు. అప్పటికే ఆ మార్క్ దాటేయడంతో హైదరాబాద్ను విజేతగా ప్రకటించారు.