Yashasvi Jaiswal | టీమిండియా యువ సంచలనం, ఇంగ్లండ్తో వరుసగా రెండు టెస్టులలో ద్విశతకాలు బాది భారత క్రికెట్లో సూపర్ స్టార్గా ఎదుగుతున్న యశస్వీ జైస్వాల్ రికార్డుల దుమ్ముదులుపుతున్నాడు. ఆదివారం రాజ్కోట్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (214) చేసిన జైస్వాల్.. ఈ క్రమంలో 12 భారీ సిక్సర్లు బాది ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. నిలకడగా రాణిస్తున్న జైస్వాల్.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. నిన్నటిదాకా ఆ జాబితాలో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అధిగమించి జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా జైస్వాల్.. 13 ఇన్నింగ్స్లలోనే 863 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు మూడు సెంచరీలు (రెండు డబుల్స్) చేశాడు. ఈ జాబితాలో నిన్నటిదాకా అగ్రస్థానాన ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా..20 ఇన్నింగ్స్లలో 855 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే.. 15 ఇన్నింగ్స్లలో 706 రన్స్తో మూడో స్థానంలో ఉండగా ఆసీస్ వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్.. 20 ఇన్నింగ్స్లలో 687 పరుగులతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు.
గతేడాది భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్.. తొలి టెస్టులోనే భారీ శతకం బాదాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాలో అంతగా రాణించకపోయినా స్వదేశంలో ఇంగ్లండ్పై మాత్రం భీకరమైన ఫామ్లో ఉన్నాడు. హైదరాబాద్ టెస్టులో 80ల లోకి వచ్చి సెంచరీ మిస్ చేసుకున్న ఈ ముంబై బ్యాటర్.. వైజాగ్లో భారత బ్యాటర్లు కనీసం 40 పరుగులు చేయడానికి తంటాలు పడ్డ చోట ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. తాజాగా రాజ్కోట్లో కూడా రెండో ఇన్నింగ్స్లో మరో ద్విశతకంతో మెరిశాడు. ఈ సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడిన జైస్వాల్.. 6 ఇన్నింగ్స్లలో 545 పరుగులు చేసి సిరీస్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు. రెండు జట్లలో అతడికి దరిదాపుల్లో కూడా ఏ బ్యాటర్ లేడు. రెండో స్థానంలో ఉన్న బెన్ డకెట్.. 3 మ్యాచ్లలో 288 రన్స్ చేశాడు.
Yashasvi Jaiswal is bossing the batting charts in his maiden World Test Championship cycle 🔥
More 👉 https://t.co/JtQKQACmFw#WTC25 | #INDvENG pic.twitter.com/dNnaagji5g
— ICC (@ICC) February 19, 2024