టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. అదేంటి..? మూడు ఫార్మాట్లలో రోహిత్ టీమిండియా సారథిగా చేశాడు కదా..? అనుకుంటున్నారు కదా. అవును నిజమే. కానీ కెప్టెన్ అయ్యాక రోహిత్ విదేశాల్లో ఆడనుండటం ఇదే తొలిసారి. అంతకుముందు జరిగిన సిరీస్ లు అన్నీ స్వదేశంలో జరిగినవే.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి.. పొట్టి ఫార్మాట్ సారథ్య పగ్గాలను వదిలేశాడు. దాంతో బీసీసీఐ వాటిని రోహిత్ కు (నవంబర్ లో) అప్పజెప్పంది. కొద్దిరోజుల తర్వాత వన్డే కెప్టెన్ గా కూడా విరాట్ ను తప్పించి వాటినీ రోహిత్ కే (డిసెంబర్ లో) ఇచ్చారు. ఇక ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత కోహ్లి.. టెస్టు నాయకుడిగా కూడా తప్పుకోవడంతో టీమిండియాకు హిట్ మ్యాన్ పూర్తి స్థాయి నాయకుడిగా మారాడు.
అయితే మూడు ఫార్మాట్లలో సారథిగా నియమితుడై ఏడు నెలల తర్వాత రోహిత్.. విదేశాలలో కెప్టెన్ గా టీమిండియా బాధ్యతలు మోయడం ఇదే తొలిసారి కానుంది. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు రోహిత్ సిద్ధమవుతున్నాడు. అంతకంటే ముందే ఎడ్జబాస్టన్ టెస్టులోనే రోహిత్.. ఈ బాధ్యతలు నిర్వర్తించేవాడే గానీ కరోనా కారణంతో అతడు ఈ టెస్టుకు దూరమయ్యాడు.
రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మ్యాచ్ లో కూడా ఓడలేదు. నవంబర్ లో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఆ తర్వాత టెస్టు సిరీస్ జరిగినా దానికి రోహిత్ కెప్టెన్ కాదు. జనవరిలో అతడు సఫారీ సిరీస్ కు గాయం కారణంగా వెళ్లలేదు. అక్కడ టీమిండియా వన్డేలలో వైట్ వాష్ (0-3) అయింది. ఈ సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్. ఇక ఫిబ్రవరిలో వెస్టిండీస్, మార్చిలో శ్రీలంక తో జరిగిన వన్డే, టీ20, టెస్టు సిరీస్ లలో రోహిత్ తిరిగి జట్టుతో చేరాడు. ఈ మూడు సిరీస్ లలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. స్వదేశంలో ఇరగదీసిన రోహిత్.. విదేశాలలో ఏం చేస్తాడో చూడాలి మరి.. గురువారం ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.