Asia Cup | జరుగుతుందో, లేదోనన్న అనుమానాల మధ్య మొత్తానికి ఆసియాకప్(Asia Cup) ప్రారంభమైంది. ఆసియాకప్ కోసం ఈసారి పాకిస్థాన్(Pakistan) ఆథిత్యమివ్వాల్సి ఉండగా.. పాక్ వెళ్లేందుకు భారతజట్టు (Team India) నిరాకరించడంతో మధ్యే మార్గంగా శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)నిర్ణయించింది. భారత్ తన మ్యాచ్లను శ్రీలంక (Sri Lanka)లో ఆడనుండగా మరికొన్ని మ్యాచ్లను పాక్, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆగస్టు 30న పాకిస్థాన్లోని ముల్తాన్లో పాక్-నేపాల్ మధ్య మ్యాచ్తో టోర్నీ ప్రారంభమైంది. ఈసారి ఆసియాకప్లో నేపాల్ (Nepal) కూడా అరంగేట్రం చేసింది. దీంతో ఆసియాకప్ ఆడుతున్న 8వ దేశంగా రికార్డులకు ఎక్కింది. అయితే, ఆసియాకప్లో మున్ముందు మరిన్ని జట్లను భాగస్వామ్యం చేయాలని ఏసీసీ భావిస్తోంది. మరి ఆ జట్లేవో తెలుసుకుందామా?
హాంకాంగ్ 1969లోనే ఐసీసీ అసోసియేట్ మెంబర్ అయింది. 1996లో తొలిసారి ఆసియాకప్ ఆడింది. అయితే, గ్రూప్ స్టేజ్లో అర్హత సాధించడంలో విఫలమైంది. 2004 ఆసియాకప్లో కొలంబోలో బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మ్యాచ్లో హాంకాంగ్ (Hongkong)వన్డేల్లో అరంగేట్రం చేసింది. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓటములతో తర్వాతి స్టేజ్కు అర్హత సాధించడంలో విఫలమైంది. 2008లో మరోమారు ఈ టోర్నీలో ఆడింది. అయితే, ఈసారి కూడా ఇండియా, పాకిస్థాన్ చేతుల్లో ఓడి గ్రూప్ రౌండ్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత మళ్లీ పదేళ్లకు 2018లో మళ్లీ ఆసియాకప్లో ఆడే చాన్స్ లభించింది. ఈసారి కూడా గ్రూప్-ఎలో ఇండియా, పాకిస్థాన్ చేతుల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. అయితే, తొలిసారి పోరాట పటిమ కనబర్చింది. 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు ముచ్చెమటలు పట్టించింది. చివరికి 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు ప్రదర్శనకు ప్రశంసలు దక్కాయి. 2022లో జరిగిన ఆసియాకప్ టోర్నీలో టీ20 ఫార్మాట్లోనూ ఆడేందుకు హాంకాంగ్ అర్హత సాధించినా వరుసగా నాలుగోసారి తర్వాతి దశకు అర్హత సాధించడంలో విఫలమైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)1994 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది. 1996లో తొలిసారి షార్జాలో ఇండియాతో ఆడే చాన్స్ దక్కింది. 1996లో ఇండియాలో జరిగిన ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కినప్పటికీ గ్రూప్ స్టేజ్లో రాణించలేకపోయింది. 2004లో ఆసియాకప్లో అరంగేట్రం చేసింది. ఆ టోర్నీలోనూ చతికిలపడినప్పటికీ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2008లో పాకిస్థాన్ ఆథిత్యమిచ్చిన ఆసియాకప్లో యూఏఈ క్వాలిఫై అయినా షరామామూలుగానే శ్రీలంక, బంగ్లాదేశ్పై ఓడి నిష్క్రమించింది. ఆ తర్వాత మరెప్పుడూ ఆసియాకప్లో ఆడే అవకాశం ఆ జట్టుకు లభించలేదు. వచ్చే టోర్నీని 8జట్లతో నిర్వహించాలని భావిస్తున్న ఏసీసీ యూఏఈని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
వన్డే హోదా కలిగిన ఒమన్(Oman) ఐసీసీ సభ్యదేశం. 2014లో ఆ హోదా లభించిన తర్వాత జూలై 2015లో ఆఫ్ఘనిస్థాన్తో తొలిసారి టీ20లు ఆడింది. ఏప్రిల్ 2019లో నమీబియాతో వన్డేలు ఆడింది. 2015లో ఏసీసీ ట్వంటీ20 కప్ గెలుచుకుని రికార్డులకెక్కింది. ఈ విజయంతో 2015 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫయర్కు అర్హత సాధించి ఐర్లాండ్, స్కాంట్లాండ్తో ఆడింది. 2018లో మలేసియాలో జరిగిన ఆసియాకప్ క్వాలిఫయర్లో హాంకాంగ్ విజేతగా నిలవగా, ఒమన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఆసియాకప్లోనూ క్వాలిఫయర్ రౌండ్లో ఆడింది. అయితే, ఏసీసీ వెస్ట్రన్ రీజియన్ టీ20 టోర్నీలో మూడు మ్యాచ్లు ఓడి నిరాశపరించింది.
మలేసియా(Malaysia) 1967 నుంచి ఐసీసీ సభ్య దేశంగా ఉంది. 1979 ఉంచి ఏడుసార్లు ప్రపంచకప్ క్వాలిఫయర్ ఎడిషన్లోనూ ఆడింది. అలాగే, 2007 నుంచి ఐదుసార్లు ఏసీసీ టీ20 కప్లో ఆడినా ఇప్పటి వరకు టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. 2010, 2014 ఏషియన్ గేమ్స్లో క్వార్టర్ ఫైనల్స్కు క్వాలిఫై అయింది. 2018లో మలేసియా ఆసియాకప్ క్వాలిఫయర్స్కు ఆతిథ్యమిచ్చినా హోం కండిషన్స్ను సద్వినియోగం చేసుకోలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2023 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో సౌదీ అరేబియా, ఖతర్ జట్లను ఓడించి కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే సాధించి గ్రూపులో మూడో స్థానంలో నిలిచింది.వచ్చే ఆసియాకప్లో జట్లను పెంచాలనుకుంటే పరిగణనలోకి తీసుకోవాల్సిన జట్లలో ఇది కూడా ఒకటి. భారత్, పాకిస్థాన్ వంటి జట్లతో ఆడితే మలేసియా క్రికెట్లో నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంది.
కువైట్ (Kuwait)1998లో ఐసీసీ అనుబంధ సభ్యదేశమైంది. 2000వ సంవత్సరం నుంచి 2014 వరకు ఏసీసీ ట్రోఫీలు ఆడింది. 2004, 2014 ఎడిషన్లలో మంచి ప్రదర్శన కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ పశ్చిమాసియాదేశం ఏసీసీ ట్వంటీ20 కప్ ఆడినా విజేతగా నిలవలేకపోయింది. 2020 ఆసియాకప్ క్వాలిఫయర్లో రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో అరబ్ ఎమిరేట్స్ చేతిలో ఓడింది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో నేపాల్లో జరిగిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్లో సెమీఫైనల్స్కు క్వాలిఫై అయింది. నేపాల్తో జరిగిన సెమీఫైనల్లో ఫలితం తేలలేదు. దీంతో ఈసారి ఈసారి ఆసియకప్కు అర్హత సాధించలేకపోయింది.