Abhishek Nayar: ఐపీఎల్ 16వ సీజన్లో చితక్కొట్టిన యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) భారత జట్టు తరఫున కూడా బాదేస్తున్నాడు. ఆసియా గేమ్స్లో నేపాల్పై సెంచరీతో కదం తొక్కిన యశస్వీ.. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ తొలి పోరులో దంచికొట్టాడు. ధనాధన్ ఆటతో అదరగొట్టిన ఈ లెఫ్ట్హ్యాండర్పై భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్(Abhishek Nayar) ప్రశంసలు కురిపించాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడడం యశస్వీ బలమని, అతడు అదే స్టయిల్ను కొనసాగించాలని నాయర్ అభిప్రాయపడ్డాడు.
‘అగ్రెస్సివ్గా ఆడడం యశస్వీ బలం. అందరిలా అతడు సెటిల్ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోడు. అతడొక పరుగుల సునామీ. పైగా స్వేచ్ఛగా ఆడమని అతడికి కోచ్, కెప్టెన్ చెప్పి ఉంటారు. దేశవాళీలో ముంబై తరఫున ఎలాగైతే విధ్వంసక ఇన్నింగ్స్లు ఆడతాడో.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు అలానే చెలరేగుతాడు. అందుని అతడు తన ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని నాయర్ జియో సినిమాతో తెలపాడు.
అభిషేక్ నాయర్
నాయర్ ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఫ్రాంచైజీకి అసిస్టెంట్ కోచ్గా సేవలందిస్తున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో టెస్టు జట్టులోకి చోటు దక్కించుకున్న యశస్వీ వెస్టిండీస్ సిరీస్లో శతకంతో గర్జించాడు. తొలి టెస్టులో రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ యువకెరటం 171 పరుగులతో మాజీల మెప్పు పొందాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో యశస్వీ విశ్వరూపంతో అలరించాడు. 14 మ్యాచుల్లో ఈ యంగ్స్టర్ 163. 21 స్ట్రైక్రేటుతో 625 పరుగులు బాదాడు. అందులో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో పాటు సెంచరీ కూడా ఉంది. గత రెండు సీజన్లలోనూ యశస్వీ 148.21, 132.99 స్ట్రైక్ రేటుతో పరుగుల వరద పారించాడు.
ఐపీఎల్లో యశస్వీ సెంచరీ అభివాదం
వైజాగ్లో జరిగిన తొలి టీ20లో యువ భారత్ 4 వికెట్లతో గెలిచింది. 209 పరుగుల ఛేదనలో యశస్వీ తొలి బంతికే బౌండరీతో ఆసీస్కు తన ఉద్దేశం చెప్పాడు. రుతురాజ్ గైక్వాడ్(0) డైమండ్ డక్గా వెనుదిరిగినా.. ఈ చిచ్చర పిడుగు జోరు తగ్గించలే. 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు సాధించి కంగారూలను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆతర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(80), ఇషాన్ కిషన్(58) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలుపు వాకిట నిలిపారు. చివర్లో ఫినిషర్ రింకూ సింగ్(22 నాటౌట్) లాంచనం పూర్తి చేశాడు. దాంతో, భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సిరీస్లో కీలకమైన రెండో టీ20 నవంబర్ 26న తిరువనంతపురంలో జరుగనుంది.