న్యూఢిల్లీ: డెఫ్లింపిక్స్లో భారత యువ షూటర్ అభినవ్ దేశ్వాల్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఇప్పటికే తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ పసిడి చేజిక్కించుకోగా.. తాజాగా అభినవ్ పతకంతో కలిపి భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి.
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో శనివారం పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అభినవ్ షూటౌట్లో పతకం పట్టేశాడు. 234.2 పాయింట్లతో అభివన్, ఒలెక్సి లేజ్బిక్ (ఉక్రెయిన్) సమంగా నిలిచారు. ఈ క్రమంలో షూటౌట్ నిర్వహించగా.. 10.3తో ఈ 15 ఏండ్ల ఉత్తరాఖండ్ షూటర్ విజేతగా నిలిచాడు. 9.7 పాయింట్లతో ఉక్రెయిన్ షూటర్ రజతం పొందగా.. చైనీస్ తైపీ షూటర్ హు మింగ్ జూ (212.8) కాంస్యం నెగ్గాడు.