AB De Villiers: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు రెండు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడటంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ అంటే కనీసం మూడు మ్యాచ్లు అయినా ఉండాలని, అందుకు అనుగుణంగా షెడ్యూల్ను ఏర్పాటుచేయాలని క్రికెట్ విశ్లేషకులు భావించారు. తాజాగా దీనిపై దక్షిణాఫ్రికా మాజీ సారథి, క్రికెట్ అభిమానులు మిస్టర్ 360గా పిలుచుకునే ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ కారణంగానే టెస్టు సిరీస్లు తగ్గాయని అతడు ఆరోపించాడు.
డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో మూడో మ్యాచ్ లేకపోవడం నాకు నిరాశ కలిగించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్కు పెరుగుతున్న ప్రాధాన్యతే దీనికి కారణం. దీనికి ఎవరిని నిందించాలో నాకైతే తెలియడం లేదు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. అన్ని జట్లూ టెస్టులు ఆడి ఎవరు మెరుగ్గా ఆడతారో తెలియాలంటే అన్ని జట్లకూ సమానంగా మ్యాచ్లు నిర్వహించాలి…’ అని అన్నాడు.
Happy New Year to all. ✨
In the new episode of the #360Live I reviewed India’s tour of South Africa and take some questions along the way, before turning our attention to the upcoming #SA20
📺🔗: https://t.co/1fS701yIfq pic.twitter.com/j9S1Yb4KCf
— AB de Villiers (@ABdeVilliers17) January 7, 2024
సౌతాఫ్రికా జట్టు ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరగాల్సి ఉన్న రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ద్వితీయ శ్రేణి జట్టును పంపించడం విమర్శలకు తావిచ్చింది. సుమారు 18 మంది సభ్యుల ఈ జట్టులో కెప్టెన్తో సహా ఎనిమిదిమంది కొత్తవారే. సౌతాఫ్రికాలో జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 దాకా ఎస్ఎ20 లీగ్ నేపథ్యంలో సౌతాఫ్రికా ప్రధాన ఆటగాళ్లంతా ఈ లీగ్కే ప్రాధాన్యమివ్వడంతో సఫారీలు ద్వితీయ శ్రేణి జట్టును పంపిస్తున్నారు.