హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా మళ్లీ మెరిశాడు. కరీంనగర్ వేదికగా రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 7వ అంతర్ జిల్లాల రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్లో ఆశీర్వాద్ రెండు స్వర్ణ పతకాలు దక్కించుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మొత్తం 130 మంది సైక్లిస్టులు పాల్గొన్న ఈ టోర్నీలో ఆశీర్వాద్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
బాలుర అండర్-18తో పాటు అండర్-23 విభాగాల్లో ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చాడు. ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన తొలి తెలంగాణ సైక్లిస్టుగా నిలిచిన ఆశీర్వాద్..భవిష్యత్లో మరింత మెరుగ్గా రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 2 స్వర్ణ పతకాలు గెలిచిన సక్సేనాను రాష్ట్ర సైక్లింగ్ సంఘం సన్మానించింది.