డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సెమీస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్పై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు త్వరగా రిటర్న్ ఫ్లైట్కు టికెట్లు బుక్ చేసుకుంటే బెటర్ అని.. ఇప్పుడైతే కాస్త తక్కువ రేటుకే అందుబాటులో ఉన్నాయంటూ ట్రోల్ చేశాడు. అఫ్గానిస్తాన్తో ఓడిన ఇంగ్లండ్.. తర్వాత దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతిలో కూడా ఓడిన విషయం తెలిసిందే.
లంక చేతిలో ఇంగ్లండ్ పరాజయం తర్వాత ఆకాశ్ తన యూట్యూబ్ వేదికగా మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ గురించి ఏం చెబుతాం..? మీ గురించి ఏం చెప్పాలో తెలియని స్థితిలోకి మీరు నన్ను నెట్టేశారు. మీరు ఇప్పుడే ఇంగ్లండ్కు రిటర్న్ టికెట్లు బుక్ చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే కాస్త తక్కువ రేట్లకే టికెట్లు దొరుకుతాయి. కొద్దిరోజులైతే మళ్లీ వాటి ధర కూడా పెరగొచ్చు..’ అంటూ ట్రోల్ చేశాడు.
ఇంగ్లండ్ అన్ని రంగాలలో విఫలమవుతోందని ఆకాశ్ చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసినా ఛేదనకు వచ్చినా వాళ్లు విఫలమవుతున్నారని అన్నాడు. ‘వాళ్లు లక్ష్యాలను ఛేదించడమే కాదు.. చేసిన స్కోర్లను కాపాడుకునేందుకు కూడా నానా తంటాలు పడుతున్నారు’ అని వ్యాఖ్యానించాడు. మొదట బ్యాటింగ్ చేస్తే ధాటిగా పరుగులు చేయడంలో ఇంగ్లండ్ తడబడుతున్నదని అన్నాడు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా పేరున్నా వాళ్ల ఆట మాత్రం సాధారణ స్థితి కంటే దారుణంగా ఉందని చోప్రా అన్నాడు.
లంకతో గురువారం ముగిసిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ (43) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్య ఛేదనను లంక 25.4 ఓవర్లలోనే ఛేదించింది. నిస్సంక (77), సదీర సమరవిక్రమ (65)లు లంకకు ఈజీ విక్టరీ అందించారు.