అమరావతి : మహారాష్ట్రలోని నాగపూర్లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడికి స్థానం దక్కింది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన తల్లిదండ్రులు నావీలో పనిచేస్తూ ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు కోన శ్రీకర్ భరత్ జట్టులో స్థానం దక్కించుకోవడం పట్ల తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2012లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన భరత్ మొత్తం 78 మ్యాచ్లు ఆడి తొమ్మిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ (308) సాధించిన తొలి వికెట్ కీపర్గా ఘనత సాధించాడు. ఈ ప్రతిభతో భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన భరత్ 2015లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2021 సీజన్ మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్ను కొనుగోలు చేసింది. ఈ సీజన్లో మొత్తం 191 పరుగులు సాధించిన భరత్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించి సత్తాను చాటాడు.
రెండేళ్ల క్రితం జరిగిన స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్కు భరత్ను బీసీసీఐ ఎంపిక చేసినా కాని అప్పటికే పంత్ జట్టులో రాణిస్తుండడంతో తుది జట్టులో భరత్కు చోటు దక్కలేదు. లిస్ట్-ఎ క్రికెట్లో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు, టీ20 క్రికెట్లో మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన శ్రీకర్ భరత్ టీమిండియాలో స్థానం దక్కించుకునడం పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.