ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న వైజాగ్ టెస్టు రసకందాయంలో పడింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉన్న టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. చాన్నాళ్ల తర్వాత శుభ్మన గిల్ బ్యాట్ నుంచి చక్కటి సెంచరీ జాలువారగా.. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు!
భారత గడ్డపై నాలుగో ఇన్నింగ్స్లో 399 పరుగుల లక్ష్యఛేదన అంటే దాదాపు అసాధ్యమే.. కానీ.. ఇంగ్లిష్ టీమ్ ఆటతీరు టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. ‘బజ్బాల్’ పేరుతో గత రెండేండ్లుగా పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా.. స్టోక్స్ సేన సాగిస్తున్న విధ్వసాన్ని మన బౌలర్లు ఎలా నిలువరిస్తారనేది కీలకం. తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకోగలిగితే సిరీస్ సమం చేసినట్లే!!
Ind Vs Eng Test | విశాఖపట్నం: తొలి టెస్టులో అనూహ్య పోరాటంతో విజయం సాధించిన ఇంగ్లండ్కు.. రెండో టెస్టులోనూ దాదాపు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయానికి 399 పరుగులు అవసరం కాగా.. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (29 బ్యాటింగ్), డకెట్ (28) ధనాధన్ ఆటతీరుతో తమ ఉద్దేశాన్ని చాటగా.. ప్రస్తుతం క్రాలీతో పాటు నైట్వాచ్మన్ రేహాన్ అహ్మద్ (9) క్రీజులో ఉన్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ నెగ్గాలంటే మరో 332 పరుగులు చేయాల్సి ఉంది.
భారత్లోనే కాకుండా.. మొత్తం ఆసియా ఖండంలో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో నాలుగో ఇన్నింగ్స్లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేకపోయినా.. ఇంగ్లండ్ విధ్వంసక ఆటతీరు భారత అభిమానులను ఆందోళన పరుస్తున్నది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 28/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ సేన చివరకు 255 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుభ్మన్ గిల్ (147 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎట్టకేలకు బ్యాట్కు పనిచెప్తూ చక్కటి సెంచరీ నమోదు చేసుకోగా.. అక్షర్ పటేల్ (45) అతడికి అండగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (17), రోహిత్ (13), శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పాటిదార్ (9), శ్రీకర్ భరత్ (6) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో హార్ట్లీ 4, రేహాన్ మూడు వికెట్లు పడగొట్టారు.
బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. వెటరన్ పేసర్ అండరసన్ నిప్పులు చెరిగే బంతులతో రోహిత్, జైస్వాల్ను వరస ఓవర్లలో పెవిలియన్కు పంపగా.. పట్టుదలతో బ్యాటింగ్ చేసిన గిల్ ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. అనవసర షాట్ల జోలికి పోకుండా పూర్తి నియంత్రణలో బ్యాటింగ్ చేసిన శుభ్మన్.. ఇన్నింగ్స్ను గాడిన పెట్టగా.. స్టోక్స్ అద్భుత ఫీల్డింగ్తో శ్రేయస్ అయ్యర్ పెవిలియన్ చేరాడు. రజత్ పాటిదార్ విఫలమైనా.. అక్షర్తో కలిసి గిల్ స్కోరుబోర్డును నడిపించాడు. ఇక ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం ఖాయమే అనుకుంటున్న దశలో సెంచరీ అనంతరం గిల్ ఔట్ కాగా.. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. చివర్లో అశ్విన్ (29) కొన్ని విలువైన పరుగులు చేసి లక్ష్యాన్ని 400కు చేరువ చేశాడు.
‘భారత జట్టు 600 లక్ష్యాన్ని నిర్దేశించినా.. దాన్ని ఛేదించొచ్చని కోచ్ మెక్కల్లమ్ మాతో చెప్పాడు’.. మూడో రోజు ఆట అనంతరం ఇంగ్లిష్ పేసర్ అండర్సన్ అన్న మాట ఇది. ఈ ఒక్క వాఖ్యం చాలు ఇంగ్లండ్ జట్టు ఎలాంటి మానసిక స్థితితో ఈ మ్యాచ్కు సిద్ధమైందో చెప్పేందుకు! ఇటీవలి కాలంలో టెస్టు క్రికెట్ను కొత్త పుంతలు తొక్కిస్తూ.. దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న ఇంగ్లండ్.. భారీ లక్ష్యాలను ఛేదిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. బెన్ స్టోక్స్ సారథిగా.. మెక్కల్లమ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ జట్టు టెస్టుల్లోనూ టీ20 తరహా దూకుడు ప్రదర్శిస్తున్నది. భారత గడ్డపై ‘బజ్బాల్’ పప్పులు ఉడకవని.. స్పిన్నర్లు సత్తాచాటే చోట ఇంగ్లండ్ దూకుడు మంత్రం పనిచేయదని.. సిరీస్కు ముందు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అది కేవలం భ్రమే అని.. ఉప్పల్ టెస్టులో స్టోక్స్ సేన నిరూపించింది.
ఆశలే లేని స్థితి నుంచి అద్వితీయ పోరాటంతో మ్యాచ్ను వశం చేసుకుంది. ఇప్పుడు వైజాగ్లో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యం నిలిచింది. సాధారణంగా మరే జైట్టెనా ఇంత లక్ష్యాన్ని చూస్తే ముందే చేతులెత్తేసేది కానీ.. ‘బజ్బాల్’ ఆటతీరును ఆవాహన చేసుకున్న ఇంగ్లండ్ మాత్రం అదో సాధారణ టార్గెట్లా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. మరో రెండు రోజుల ఆట మిగిలిఉన్న ఈ మ్యాచ్లో ఫలితం తేలడం పక్కా కాగా.. అది ఎవరికి అనుకూలంగా వస్తుందో అనేది ఆసక్తికరం! నైట్వాచ్మన్గా పంపిన రేహన్ అహ్మద్ను ఇంగ్లిష్ కామెంటేటర్లు పించ్హిట్టర్ అని సంబోధించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి దూకుడుకు అసలు పరీక్ష పెట్టనున్న ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందా.. లేక ఇంగ్లండ్ జట్టుదు పైచేయి అవుతుందా అనేది నేడు తేలనుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 396;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 253;
భారత్ రెండో ఇన్నింగ్స్: 255 (గిల్ 104, అక్షర్ 45; హార్ట్లీ 4/77, రేహాన్ 3/88);
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 67/1 (క్రాలీ 29 నాటౌట్, అశ్విన్ 1/8).