నీలగిరి:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. పక్కా సమాచారంతో ముప్పేట దాడికి పాల్పడ్డ పోలీసులు..పంటర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ అపూర్వరావు బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు.
ఆమె మాట్లాడుతూ ‘మిర్యాలగూడకు చెందిన రాజేశ్కుమార్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి పట్టణంలో బెట్టింగ్ చేస్తున్నట్లు తెలిసింది. సీఐ రాఘవేందర్, ఎస్ఐ శివతేజ్, టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్పెషల్ టీమ్ దాడిలో పాల్గొని వారిని అదుపులోకి తీసుకున్నారు’ అని అన్నారు. ఎవరైనా అక్రమంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.