ఐపీఎల్లో ఆడుతున్న ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడంతో ఈ లీగ్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో ఇంగ్లాండ్, ఆస్ర్టేలియా దేశాలు విమాన ప్రయాణాలను నిషేధించాయి. అయితే ఇంగ్లీష్ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లాలంటే నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. అక్కడికి వెళ్లిన తర్వాత 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి.
లీగ్ వాయిదా పడటంతో విదేశీ క్రికెటర్లు స్వదేశాలకు వెళ్లేందుకు బీసీసీఐతో పాటు ఫ్రాంఛైజీలు చార్టర్డ్ విమానాలలో ప్రయాణి ఏర్పాట్లు చేస్తుండగానే పలువురు ఇంగ్లాండ్ క్రికెటర్లు తమ దేశానికి బయలుదేరి వెళ్లారు. ఐపీఎల్లో పాల్గొన్న 11 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఎనిమిది మంది ఇంటికి చేరుకున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి వెల్లడించారు.
ప్రభుత్వ అనుమతి పొందిన హోటళ్లలో వీరంతా క్వారంటైన్లో ఉంటారని చెప్పాడు. ఈ ఎనిమిది క్రికెటర్లు వాణిజ్య విమానాల ద్వారా అక్కడికి చేరుకున్నట్లు తెలిసింది. మరో 48 గంటల్లో మిగిలిన ముగ్గురు క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్(పంజాబ్ కింగ్స్), ఇయాన్ మోర్గాన్(కోల్కతా నైట్రైడర్స్) భారత్ నుంచి బయలుదేరుతారని ఆ ప్రతినిధి వివరించారు.