భారత్, ఇంగ్లండ్ మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం దక్కించుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. గురువారం నుంచి రాజ్కోట్లో మూడో టెస్టుకు తెరలేవనుంది. విరాట్ కోహ్లీ, రాహుల్ గైర్హాజరీలో టీమ్ఇండియా యువ క్రికెటర్ల మేళవింపుతో కనిపిస్తుంటే.. ఇంగ్లండ్ భారీ మార్పులేమి లేకుండానే బరిలోకి దిగుతున్నది. ధృవ్ జురెల్, సర్ఫారాజ్ఖాన్ అరంగేట్రం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. మొత్తంగా ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
రాజ్కోట్: ఐదు మ్యాచ్ల సిరీస్లో కీలకమైన మూడో మ్యాచ్కు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న ఇరు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి. నిరంజన్షా స్టేడియం వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓవైపు విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైతే..మరోవైపు కేఎల్ రాహుల్ గాయం కారణంగా మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.
దీంతో జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తున్నది. టాపార్డర్లో కెప్టెన్ రోహిత్శర్మ మినహా అనుభవజ్ఞుడైన బ్యాటర్ కనిపించడం లేదు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ , శుభ్మన్ గిల్ ఫామ్మీద ఉండటం భారత్కు కలిసి రానుంది. ఇప్పటికే అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్కు తోడు వికెట్కీపర్, బ్యాటర్ కేఎస్ భరత్ స్థానంలో ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కీపింగ్లో ఆకట్టుకుంటున్న భరత్..బ్యాటింగ్లో విఫలమవుతుండటం జట్టుకు భారంగా మారింది.
మరోవైపు దేశవాళీ క్రికెట్లో 46.47 సగటుతో పరుగులు సాధించిన జురెల్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో సిద్ధహస్తుడు కావడం అనుకూలాంశం కానుంది. కేఎల్ రాహుల్ స్థానాన్ని ముంబైకర్ సర్ఫరాజ్ఖాన్తో భర్తీ చేయనున్నారు. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ అవకాశమొస్తే సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నాడు. మొత్తంగా టీమ్ఇండియా మిడిలార్డర్లో అనుభవలేమి కనిపిస్తున్నది. బౌలింగ్లో ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్,జడేజా, కుల్దీప్యాదవ్ ఉండగా, పేస్ బాధ్యతలను బుమ్రా, సిరాజ్ పంచుకోనున్నారు. గత రెండు టెస్టుల్లో బుమ్రా అదరగొడుతున్నాడు. రివర్స్ స్వింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్ల నడ్డివిరుస్తున్నాడు.
ఇద్దరు పేసర్లతో ఇంగ్లండ్:
బజ్బాల్ వ్యూహాన్ని నమ్ముకున్న ఇంగ్లండ్ అందుకు తగ్గట్లు ముందుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శనతో అనూహ్యంగా తొలి టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన ఇంగ్లండ్.. విశాఖ టెస్టులో కంగుతిన్నది. టీమ్ఇండియా స్పిన్ దాడికి బుమ్రా పేస్ విజృంభణ తోడు కావడంతో ఇంగ్లండ్ ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. రాజ్కోట్ పిచ్ పచ్చికతో కనిపిస్తున్న నేపథ్యంలో షోయబ్ బషీర్ను తప్పిస్తూ మార్క్ వుడ్ను తిరిగి జట్టులోకి తీసుకుంది. జేమ్స్ అండర్సన్ జతగా వుడ్ పేస్ బౌలింగ్ను పంచుకోనున్నాడు. గాయంతో జాక్ లీచ్ సిరీస్కు పూర్తిగా దూరం కాగా, టామ్ హార్ట్లే, రేహాన్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు.
రోహిత్ సారథ్యంలోనే..
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్శర్మ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. తద్వారా గత కొన్ని రోజులుగా రోహిత్ కెప్టెన్సీపై వస్తున్న వార్తలకు తాజాగా పుల్స్టాప్ పడింది. బుధవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పేరును నిరంజన్ షా పేరు మీద మార్చిన కార్యక్రమంలో జై షా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు అంశాలపై అతను మాట్లాడుతూ ‘స్వదేశం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్ ఓడినప్పటికీ అందరి మనసులు గెలుచుకుంది.
బార్బడోస్లో జరిగే వరల్డ్కప్ ఫైనల్లోనూ రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా విజయకేతనం ఎగురవేస్తుందన్న నమ్మ కం నాకుంది’ అని అన్నాడు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ సమక్షంలో జై షా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమయ్యాడని జై షా పేర్కొన్నాడు. బలమైన కారణంతోనే కోహ్లీ సిరీస్లో భాగం కాలేకపోయాడని షా చెప్పుకొచ్చాడు.
జట్ల అంచనా
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), జైస్వాల్, గిల్, పాటిదార్, సర్ఫరాజ్ఖాన్, జడేజా, జురెల్/భరత్, అశ్విన్, కుల్దీప్యాదవ్, బుమ్రా, సిరాజ్ ఇంగ్లండ్: స్టోక్స్(కెప్టెన్), క్రాలే, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, ఫోక్స్, రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్లే, వుడ్, అండర్సన్.
1 టెస్టుల్లో ఐదు వందల వికెట్ల మైలురాయికి టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ మరో వికెట్ దూరంలో ఉన్నాడు.