నమస్తే తెలంగాణ క్రీడావిభాగం ;వరల్డ్కప్నకు ఆతిథ్యమిచ్చే జట్టు ట్రోఫీ గెలువలేదనే అపవాదును తుడిచిపెడుతూ.. 2011లో భారత్లో జరిగిన మెగాటోర్నీలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని టీమ్ఇండియా జగజ్జేతగా అవతరించింది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనగా.. రెండు గ్రూప్లుగా సాగిన లీగ్ దశలో భారత్ 4 విజయాలు ఒక ఓటమి ఒక ‘టై’తో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్స్లో కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియా ఎదురు పడటంతో భారత్ కథ ముగిసినట్లే అని అంతా భావించినా.. యువరాజ్ సింగ్ అసమాన ప్రతిభతో టీమ్ఇండియాను ఒంటి చేత్తో విజయాన్నందించాడు. గెలుపు పరుగులు చేసిన అనంతరం అతడు క్రీజులో కుప్పుకూలి బ్యాట్ను ఝళిపించిన తీరు చూస్తే చాలు ఆ విజయం టీమ్కు ఎంత అవసరమో ఇట్టే అర్థమవుతుంది. కంగారూలతో కీలక పోరులో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ సెంచరీ చేయడంతో ఆసీస్ 260 పరుగులు చేసింది.
ఛేదనలో సచిన్, గంభీర్, యువరాజ్ అర్ధశతకాలు బాదడంతో టీమ్ఇండియా పని సులువైంది. ఇక మొహాలీ వేదికగా జరిగిన సెమీఫైనల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అప్పటి వరకు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్గా చిరస్థాయిలో నిలిచిపోయిన భారత్, పాకిస్థాన్ పోరులో.. టీమ్ఇండియాదే పైచేయి అయింది. సచిన్ టెండూల్కర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ (85)తో సత్తాచాటాడు. దాయాది ముందు భారత్ 261 పరుగుల టార్గెట్ నిర్దేశించగా.. ఛేదనలో పాకిస్థాన్ 231 పరుగులకే పరిమితమైంది. దీంతో ధోనీ సేన ఫైనల్కు చేరగా.. ముంబైలోని వాంఖడే స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. టాస్ సమయంలోనే రెండు సార్లు కాయిన్ ఎగరేసేలా చేసిన అభిమాన సందోహం.. మ్యాచ్ ఆసాంతం అదే జోష్ కనబర్చింది. మొదట జయవర్ధనే సెంచరీతో శ్రీలంక 274 పరుగులు చేయగా.. గౌతమ్ గంభీర్ (97), ధోనీ (91) మెరుపులతో టీమ్ఇండియా మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.