న్యూఢిల్లీ: రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భారత మహిళా రెజ్లర్లకు 1983లో క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన జట్టు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ జట్టు ఒక ప్రకటన విడుదల చేసింది.
‘ఢిల్లీలో భారతదేశపు ఛాంపియన్లు అయిన మహిళా రెజ్లర్లను మ్యాన్ హ్యాండిల్ చేసిన తీరును చూసి మేం చాలా వేదనకు, వ్యాకులతకు గురయ్యాం. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను వారు గంగానదిలో పడేయాలనే ఆలోచనకు రావడం ఎంతో బాధపెట్టింది. ఎందుకంటే ఆ పతకాల్లో ఏళ్ల తరబడి చేసిన శ్రమ, త్యాగాలు, సంకల్పం దాగి ఉంటుంది. అంతేగాక వారు గెలిచిన పతకాలు వారికే కాదు, దేశానికే గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తాము రెజ్లర్లను కోరుతున్నాం. వారి సమస్య సాధ్యమైనంత త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.’ అని తమ ప్రకటనలో 1983 క్రికెట్ వరల్డ్కప్ విన్నింగ్ టీమ్ పేర్కొన్నది.
రెజ్లర్లు తమ పతకాలను విసిరిపడేయాలనే నిర్ణయం తీసుకోవడం గుండెలను పిండేసిందని, అయితే వారి నిర్ణయాన్ని తాము సమర్థించడంలేదని, ఎందుకంటే పతకాలు సాధించడం అంత సులువు కాదని, వాటి వెనుక ఎంతో కష్టం దాగి ఉందని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుల్లో ఒకరైన మదన్లాల్ అన్నారు. వారి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.