సుదీర్ఘ ఫార్మాట్లో దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. మరో విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన కోహ్లీ అండ్ కో.. లీడ్స్లో ప్రత్యర్థిని చిత్తు చేసి లీడ్ పెంచుకోవాలని చూస్తున్నది. ఎవరో ఒకరిపై మాత్రమే ఆధారపడకుండా.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్న భారత్.. బౌలింగ్లో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తున్నది. బుమ్రా, షమీ, సిరాజ్, ఇషాంత్ను ఎదుర్కోవడం ఇంగ్లిష్ బ్యాట్స్మెన్కు శక్తికి మించిన పనైపోయింది.
లీడ్స్: వరుస విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్ఇండియా.. ఇంగ్లిష్ గడ్డపై కీలక సమరానికి సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో వర్షం కారణంగా వెనుకబడి.. లార్డ్స్లో విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచిన కోహ్లీ సేన.. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. మరోవైపు లార్డ్స్లో ఆట కంటే ఎక్కువ తమ వ్యవహార శైలితోనే వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్.. ఆ పరాజయాన్ని పక్కనపెట్టి సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పేస్కు అనుకూలించనున్న లీడ్స్ పిచ్పై భారత బౌలింగ్ దళాన్ని ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం! ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ రూట్ మినహా తక్కిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతుండగా.. భారత సారథి విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. మరి దాదాపు రెండేండ్లుగా అంతర్జాతీయ శతకం నమోదు చేయని కింగ్ కోహ్లీ.. ఈ సారైనా అభిమానుల అంచనాలను నిజం చేస్తాడా చూడాలి!
బౌలింగే బలంగా..
సాధారణంగా బ్యాటింగ్ బలంతోనే బరిలోకి దిగే భారత జట్టు.. అందుకు భిన్నంగా ఇటీవల బౌలర్ల దమ్ముతో దుమ్మురేపుతున్నది. టాపార్డర్లో ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ.. భారత్, ఇంగ్లండ్ సిరీస్లో ఎక్కువగా బౌలింగ్ గురించే చర్చ జరుగుతున్నదంటే అందుకు కారణం.. భారత పేస్ దళం ప్రదర్శనే! తొలి టెస్టులో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన మన వాళ్లు.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కేవలం రెండు సెషన్లలోనే ఇంగ్లిష్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఈ రెండు మ్యాచ్ల్లో కలిపి 40 వికెట్లకు గానూ.. 39 వికెట్లు పేసర్ల ఖాతాలోకే వెళ్లాయంటే మనవాళ్ల ప్రదర్శన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్లండ్ పిచ్లపై బ్యాటింగ్ చేసేటప్పుడు ఈగోను పక్కన పెట్టక తప్పదు. వికెట్పై ఎంత సమయం గడిపినా.. బంతి బ్యాట్పైకి రావడం కష్టమే. అందుకే ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఖరి బంతి వరకు ఒకే తీవ్రత కొనసాగించక తప్పదు.
కోహ్లీ, భారత కెప్టెన్
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, జడేజా, షమీ, ఇషాంత్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, హమీద్, మలన్, బెయిర్స్టో, బట్లర్, అలీ, కరన్, రాబిన్సన్, ఓవర్టన్/సఖీబ్, అండర్సన్.
పిచ్, వాతావరణం పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశాలున్నాయి. పిచ్పై పచ్చిక ఎక్కువ లేకున్నా.. గతంలో ఇక్కడ సీమర్లు పండుగ చేసుకున్న విషయం
గుర్తుంచుకోవాలి. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో వర్ష సూచన లేదు. వాతావరణం మేఘావృతమై ఉండనుంది.