నిబంధనలు అతిక్రమిస్తే సహించేదిలేదు
మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి
గర్మిళ్ల, మే 27 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని,ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదని మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏసీపీ అఖిల్ మహాజన్తో కలిసి పోలీస్ చెక్పోస్టులను శుక్రవారం తనిఖీ చేశారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని చెక్పోస్టు వద్ద ఉదయం 10 గంటల తరువాత బయట తిరుగుతున్న వాహనదారులను ఆపి లాక్డౌన్ సమయంలో బయటకు రావాల్సిన అవసరాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన వారిని వదిలేసి అనవసరంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. డీసీపీ మాట్లాడుతూ ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ట్రాఫిక్ సీఐ బి.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐసొలేషన్ సెంటర్కు తరలింపు
హాజీపూర్, మే 28 : హాజీపూర్ మండలంలో అకారణంగా బయట తిరుగుతున్న నలుగురు ఆకతాయిలను ఏసీపీ అఖిల్ మహాజన్ పట్టుకొని బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవన్నారు. ఏసీపీ వెంట రూరల్ సీఐ కుమార స్వామి,హాజీపూర్ ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు.
లక్షెట్టిపేట రూరల్, మే 28 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే బెల్లంపల్లిలోని ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. అనవసరంగా బయటకు వచ్చిన ఆరుగురిని బెల్లంపల్లిలోని ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు రావద్దన్నారు.ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించడానికే పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. కొంత మంది ఎంత చెప్పినా పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారని, వారికి కరోనా వస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఆయన వెంట లక్షెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, ప్రొబేషనరీ ఎస్ఐ హైమావతి, అదనపు ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కాసిపేట, మే 28 : మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తాల్లో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎలాంటి కారణాలు లేకుండా బయట తిరుగుతున్న 35 మంది ఆకతాయిలను గుర్తించారు. బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న వారిని బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ప్రధాన దారుల్లో కాకుండా ప్రతి కాలనీ గల్లీల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించారు. అకారణంగా బయట తిరిగే వ్యక్తులను బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రానికి తరలించనున్నట్లు ఏసీపీ తెలిపారు.