పల్లె ప్రగతి పనులు పూర్తి
అందుబాటులోకి వైకుంఠధామం, కంపోస్ట్యార్డు
హరితహారం నర్సరీ, ప్రకృతివనంలో మొక్కల పెంపకం
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు
రూ.కోటితో గ్రామానికి బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు
షాబాద్, మే 9: పల్లె ప్రగతి కార్యక్రమంతో మారుమూల గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏండ్ల తరబడిగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత దిశగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమై గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రతి గ్రామానికి వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, కంపోస్ట్యార్డు, హరితహారం నర్సరీ, రైతువేదిక ఏర్పాటుచేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తున్నది.
అభివృద్ధి పథంలో కుమ్మరిగూడ
షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో 2 వేల జనాభా ఉంది. ఇందులో 1,600 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ గ్రామంలో వైకుంఠధామం, కంపోస్యార్డు, పల్లె ప్రకృతివనం, హరితహారం నర్సరీ ఏర్పాటు చేశారు. 30 గుంటల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 2వేల వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారం నర్సరీలో 23 రకాలకు సంబంధించిన 12 వేల మొక్కలు పెంచుతున్నారు. ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలోని 530 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, ప్రతిరోజూ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేస్తున్నారు.
రూ.కోటితో అభివృద్ధి పనులు
కుమ్మరి గూడ గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.కోటితో అభివృద్ధి పనులు చేపట్టారు. 30 ఏండ్లుగా గ్రామస్తుల చిరకాల కోరిక షాబాద్-కుమ్మరిగూడ బీటీ రోడ్డును నిర్మించారు. దీంతో గ్రామస్తుల అతిపెద్ద సమస్య పరిష్కారమైంది. ఇందుకు రూ.80 లక్షలు మైన్స్ నిధులు కేటాయించారు. రూ.15 లక్షలతో గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.5లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. బీటీ రోడ్డుతో పాటు గ్రామంలోని ఆయా కాలనీల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. వాటికి ప్రతిరోజూ పంచాయతీ సిబ్బందితో నీరు పోయిస్తున్నారు. దీంతో గ్రామం పచ్చదనంగా మారింది. తడి, పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించి కంపోస్యార్డుకు తరలిస్తున్నారు.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయించాం. వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సహకారంతో రూ.80 లక్షలతో గ్రామానికి బీటీ రోడ్డు వేయించి, ఏండ్లనాటి సమస్యను పరిష్కరించాం. హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసి సంరక్షిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు సరఫరా చేస్తున్నాం. గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.
– పోనమోని కేతన, సర్పంచ్, కుమ్మరిగూడ
పల్లె ప్రగతి పనులు పూర్తి చేశాం
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులన్నీ పూర్తి చేశాం. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారం నర్సరీలో 12వేల మొక్కలు పెంచుతున్నాం. ఇవి హరితహారం కార్యక్రమానికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. పల్లె ప్రకృతివనంలో 2వేల మొక్కలు నాటాం. మిషన్ భగీరథ ద్వారా గ్రామంలోని 530 ఇండ్లకు తాగునీటిని సరఫరా చేస్తున్నాం. దీంతో గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామంలో వందశాతం ఇంటి పన్నులు వసూలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం.
మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి, కుమ్మరిగూడ