నిత్యం శానిటైజేషన్.. ఖైదీలకు పౌష్ఠికాహారం
ఖైదీలు వైరస్ బారిన పడకుండా చర్యలు
కొత్త ఖైదీలకు పరీక్షలు చేశాకే అనుమతి
లక్షణాలుంటే ప్రత్యేక బ్యారెక్లో బస
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారినుంచి ఖైదీలను రక్షించేందుకు తెలంగాణ జైళ్లశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సెంట్రల్ జైళ్లు సహా అన్ని జిల్లా, ఇతర జైళ్లలోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చర్యలు చేపట్టింది. ప్రతి ఖైదీకి నాలుగు మాస్కులు అందజేస్తున్నారు. రోజూ పౌష్ఠికాహారాన్ని అందిస్తూ ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నట్టు జైళ్లశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో జైళ్లన్నీ సురక్షిత వాతావరణంలో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో ఏడువేల మంది ఖైదీలు ఉన్నారని, అన్నిచోట్లా కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని వివరించారు. ఫలితంగా ఇప్పటివరకు వైరస్బారిన పడిన ఖైదీల సంఖ్య పదికి మించలేదని పేర్కొన్నారు. జైలుకు కొత్తగా వచ్చే ఖైదీలకు విధిగా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే జైళ్లలోకి అనుమతి ఇస్తున్నారు. కొవిడ్ ఉంటే చికిత్స కోసం నేరుగా గాంధీ దవాఖానకు పంపిస్తున్నామని అధికారి తెలిపారు. ఇప్పటికే జైళ్లలో ఉన్న ఖైదీలకు ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వారిని ప్రత్యేకంగా కేటాయించిన ఐసొలేషన్ బ్యారెక్స్లో ఉంచుతున్నట్టు వెల్లడించారు. లక్షణాలు ఉన్నవాళ్లకు రోజు ఒక గుడ్డు, పాలు, డ్రైఫ్రూట్స్ వంటి బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నారు. జైలు ఆవరణలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసి 45 ఏండ్లు దాటిన ఖైదీలందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.