తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి పథకానికి రూపకల్పన చేసింది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత కోసం ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం పట్ల బహజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీల సంక్షేమం కోసం ఇప్పటికే కొన్ని పథకాలు అమల్లో ఉన్నాయి. దీనికితోడు 2021-22 బడ్జెట్లో రూ.5,200 కోట్లు ప్రతిపాదించిన ప్రభు త్వం అందులోనూ అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీలు), బీసీల్లోని మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా ‘కేసీఆర్ ఆపద్బంధు’ పేరుతో కొత్త పథకానికి రూపకల్పన చేసింది.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం అంబులెన్స్లు మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాల్లోని బీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, వారికి అధునాతన పరికరాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారత చేకూర్చడం, కొన్ని బీసీ కులాలు సంచార పద్ధతిలో కొనసాగించే వృత్తులను సులభతరం చేసేందుకుగాను వాహనాలు సమకూర్చడం, మరికొన్ని కులవృత్తుల వారికి పనిముట్లను పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను బీసీ కార్పొరేషన్ ద్వారా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి ఈ ఆపద్బంధు పథకాన్ని ప్రారంభించేందుకు బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యాచరణ రూపొందించడంతో వెనుకబడిన తరగతుల కులాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘా ల్లో సభ్యులుగా ఉన్న 50 వేల బీసీ మహిళలకు అత్యాధునిక పద్ధతుల్లో కుట్టుశిక్షణ కూడా ఆపద్బంధు ద్వారా ఇప్పించనున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ఈ శిక్షణను ఇప్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మారుతున్న ఫ్యాషన్ పోకడల నేపథ్యంలో ఇలాంటి శిక్షణ బీసీ మహిళలకు ఉపకరిస్తుందని, వారికి ఆర్థిక సాధికారత చేకూరుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ‘కేసీఆర్ ఆపద్బంధు’ పథకం కింద రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధా న ఎజెండాగా కార్యాచరణ సిద్ధమవుతున్నది. దీనికోసం అంబులెన్సులపై 80 శాతానికిపైగా సబ్సిడీ ఇవ్వనుంది. అర్బన్, రూరల్ అనే తేడాలేమీ లేకుండా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎంబీసీ యువకులకు అంబులెన్సులు అందజేయనున్నారు.
ఐదారుగురు యువకులతో ఒక గ్రూపును ఏర్పాటుచేయబోతున్నారు. ఒక్కో అంబులెన్స్ ధర రూ.26 లక్షలు ఉంటుంది. ఇందులో లబ్ధిదారులు ఎంత శాతం చెల్లించాలన్నది ఇంకా ఖరారు కాకపోయినా యూనిట్ ధరలో 85 శాతానికి పైగా ప్రభుత్వమే సబ్సిడీ కింద భరించనున్నది. రోడ్ సేఫ్టీ అథారిటీతోపాటు ప్రైవేట్ సంస్థలతో ఈ అంబులెన్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకొని వారికి కచ్చితమైన, శాశ్వత ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం అభినందనీయం. ఈ పథకాన్ని సరైన రీతిలో అమలుచేస్తే.. తెలంగాణ బీసీ యువత ఆర్థికంగా మరింత ఎదగడానికి ఉపయోగపడుతుంది.
శ్రీనివాస్గౌడ్ ముద్దం