Chandrayaan-3 | న్యూఢిల్లీ: నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చేశాయి. ఆ తర్వాత అక్కడ రాత్రి ప్రారంభం కావడంతో ఆ రెండూ నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి. ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ వెలుగు రేఖలు విచ్చుకోనున్న వేళ ప్రపంచం మళ్లీ ఇస్రోవైపు చూస్తున్నది.
దక్షిణ ధ్రువంపై పగలు సూర్యుకాంతి పడగానే నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను తట్టిలేపి ప్రయోగాలకు పురమాయించాలని ఇస్రో యోచిస్తున్నది. ఆ రెండూ మళ్లీ నిద్రలేచి చంద్రుడిపై కలియదిరిగితే అది మరో అద్భుతమే అవుతుంది. గత 14 రోజులుగా అక్కడి మైనస్ 180 డిగ్రీల్లో నిశ్చలంగా ఉండిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను మేల్కొలిపేందుకు సన్నద్ధమవుతున్నారు. వారి ప్రయత్నం ఫలిస్తే మరో 14 రోజులపాటు జాబిల్లి రహస్యాలు భూమికి చేరుతూనే ఉంటాయి.