Vedanta | గుజరాత్లో సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయమై వేదంతా రీసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేండ్లలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. సెమీ కండక్టర్ చిప్లను కార్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ల్లో వినియోగిస్తారు. ప్రస్తుతానికి భారత్లో సెమీ కండక్టర్ చిప్లు తయారు కావడం లేదు. సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు కోసం తాము ఐదారు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి నియమించిన కన్సల్టెంట్స్ కమిటీ.. గుజరాత్ బెస్ట్ ఆప్షన్ అని నిర్ణయించిందని అనిల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
సెమీ కండక్టర్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సరైన వాతావరణం, మెరుగైన వసతులు గుజరాత్లోనే ఉన్నాయని నిర్ణయించిందన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో అనిల్ అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం గుజరాత్లోనే లభించిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభిస్తున్న మద్దతుతో నా హృదయం కరిగిపోయిందని, వచ్చే రెండున్నరేండ్లలో సెమీ కండక్టర్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని అనిల్ అగర్వాల్ చెప్పారు.తైవాన్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ జెయింట్ ఫాక్స్కాన్తో కలిసి వేదంతా జాయింట్ వెంచర్గా గుజరాత్లో సెమీ కండక్టర్ల పరిశ్రమ స్థాపిస్తున్నది. ఇందుకోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో వేదాంతా- ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
గుజరాత్లో సెమీ కండక్టర్ల పరిశ్రమ స్థాపించడానికి వేదంతా – ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ రూ. 1,54,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. లక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందులో రూ. 94,000 కోట్లు డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం రూ.60,000 కోట్లు సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ కోసం ఇన్వెస్ట్ చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి శాస్త్రీయ ప్రణాళిక కూడా సిద్ధం చేశామని అనిల్ అగర్వాల్ చెప్పారు.