national helpline number: దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది బాధితులు మోసపోయిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో సైబర్ మోసాల కేసుల దర్యాప్తు ఎక్కువగా సాంకేతిక అంశాలకు సంబంధించి ఉంటుంది.
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.
కస్టమర్లు తమ ఖాతాల్లోని డబ్బులు పోయినట్లు గుర్తించిన వెంటనే ఫిర్యాదు చేసేందుకు నేషనల్ హెల్ప్లైన్ నంబర్ 155260ను ఏర్పాటు చేసింది. సైబర్ మోసం కారణంగా ఆర్థిక నష్టాన్ని నివారించడానికి, ఆ తర్వాత బాధితుల ఫిర్యాదును స్వీకరించడానికి ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందించడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1న హెల్ప్లైన్ను ప్రారంభించారు.
హెల్ప్లైన్తో పాటు ఫిర్యాదుల స్వీకరణను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్(I4C) నిర్వహిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వాలెట్లు, ఆన్లైన్ మర్చంట్ల సహకారం, మద్దతుతో హెల్ప్లైన్ను నిర్వహించనున్నారు. సైబర్ మోసగాళ్ల బారినపడిన వారు వెంటనే ఆ నంబర్కు ఫిర్యాదు చేస్తే నష్టపోయిన డబ్బును త్వరగా వెనక్కి రప్పించడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.