Twitter Layoffs | గతవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్మస్క్.. సంస్థలో నాలుగో వంతు సిబ్బందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. తొలి దశలో 25 సిబ్బందికి ఉద్వాసన పలుకనున్నారని ఎలన్మస్క్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సుదీర్ఘకాలం ఎలన్మస్క్తో కలిసి పని చేస్తున్న న్యాయవాది అలెక్స్ స్పిరో సారధ్యంలో ఉద్యోగుల ఉద్వాసన చర్చలు సాగుతున్నట్లు వార్తా పత్రికల్లో వార్తలొచ్చాయి.
రెగ్యులేటరీ ఫైలింగ్లో 2021 చివరి నాటికి 7,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని ట్విట్టర్ తెలిపింది. వారిలో నాలుగోవంతు మంది అంటే సుమారు రెండు వేల మందిని తొలగించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారని సమాచారం. కాగా, ఈ విషయమై న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఉద్యోగాల తొలగింపు వార్తను ఆయన నిరాకరించారు. నవంబర్ ఒకటో తేదీన స్టాక్ గ్రాంట్స్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ముందుగానే ఆ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించినట్లు వచ్చిన వార్తపై స్పందించడానికి అంగీకరించలేదు. దీనిపై రాయిటర్స్ వార్తా సంస్థ రిక్వెస్ట్కు కూడా ట్విట్టర్ రియాక్ట్ కాలేదు.
ట్విట్టర్ను టేకోవర్ చేయడమే ఆలస్యం.. సంస్థ సీఈవోగా పని చేస్తున్న పరాగ్ అగర్వాల్, ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ్ గద్దలను ఎలన్మస్క్ తొలగించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల క్రితం ఏప్రిల్లో మొదలైన ట్విట్టర్ టేకోవర్ ప్రక్రియ గురువారం 44 బిలియన్ల డాలర్లు చెల్లింపుతో పూర్తయింది.