Chandrayaan-3 |న్యూఢిల్లీ: చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత్ కల సాకారానికి దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. చంద్రయాన్ పేరును కూడా ఆయనే సూచించారు. అంతకుముందు దీని పేరు సోమయాన్గా ఉండేది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న 1999లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ప్రాజెక్టు పేరును చంద్రయాన్గా మార్చారు. వాజ్పేయి నిర్ణయం అప్పట్లో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
బెంగళూరు, ఆగస్టు 23: చంద్రుడి గుట్టు విప్పేందుకు ఇస్రో గత 15 ఏండ్లుగా చేస్తున్న ప్రయోగాలు సరికొత్త విషయాల్ని బయటపెట్టాయి. ఆఖరి నిమిషంలో చంద్రయాన్-2 విఫలమైనా.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3తో జాబిల్లిపై విజయపతాకం ఎగురవేశారు.
చంద్రయాన్-1
అక్టోబర్ 22, 2008న శ్రీహరికోట నుంచి చంద్రయాన్-1ను ప్రయోగించారు. ఈ సక్సెస్ ఇస్రోలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జాబిల్లి ధ్రువ ప్రాంతాల్లోని నీటి జాడ ఉందని చెప్పే ముఖ్యమైన డాటా లభ్యమైంది. చంద్రుడిపై ఎక్కడ దిగాలన్న దానికి సంబంధించి హై రిజాల్యూషన్ మ్యాపుల్ని సమకూర్చింది.
చంద్రయాన్-2
రెండో లూనార్ మిషన్(చంద్రయాన్-2)ను జూలై 22, 2019న ఇస్రో చేపట్టింది. ఆర్బిటార్, ల్యాండర్, రోవర్లను స్పేస్క్రాఫ్ట్లో చేర్చి.. చంద్రుడిపైకి పంపింది. చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్య వరకు విజయవంతంగా వెళ్లింది. ల్యాండర్ విక్రమ్ను వేరుపర్చే సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టడంలో సక్సెస్ అయ్యారు. సాఫ్ట్ ల్యాండింగ్ వద్ద విఫలమైంది. ఆర్బిటార్లోని 8 సైంటిఫిక్ పరికరాలు ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నాయి. చంద్రుడిపై సోడియం పుష్కలంగా ఉందని గుర్తించింది.
చంద్రయాన్-3
జూలై 14, 2023న ఇస్రో ప్రయోగించింది. ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి మట్టిని సేకరించటం, అందులో ఉండే మూలకాలను విశ్లేషించటం, నీటి జాడను గుర్తించటం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అలాగే భూమి-చంద్రుడి మధ్య దూరాన్ని అత్యంత కచ్చితంగా కొలవటం. అంతుబట్టని విధంగా ఉన్న చంద్రుడి ఉపరితలం వాతావరణాన్ని ప్రగ్యాన్ రోవర్ మరింతగా శోధించనున్నది.