న్యూఢిల్లీ : చాట్జీపీటీ, బింగ్ ఏఐ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్కు విశేష ఆదరణ లభిస్తుండటంతో వీటి ఫలితంగా పలువురు ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే జనరేటివ్ ఏఐ టూల్స్తో (ChatGPT) కొలువుల కోత ఉండదని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. జనరేటివ్ ఏఐ కంప్యూటర్ కోడ్స్ రివ్యూ చేయడం, అర్ధమేటిక్ సమస్యలను పరిష్కరించడం, న్యూస్ ఆర్టికల్స్ రాయడం చేస్తాయని వీటి వల్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ ఉండదని పేర్కొంటున్నారు. బార్సిలోనాలో వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) సదస్సు సందర్భంగా టెక్ మహీంద్ర సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ ఏఐ టూల్స్పై స్పందించారు.
ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, రాబోయే రోజుల్లో చాట్జీపీటీ వంటి టూల్స్ అధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చాట్జీపీటీ వంటి టూల్స్ ఆవిష్కరణతో కొలువుల కోత ఉండదని, ఈ టూల్స్తో మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని గుర్నానీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీ అన్నింటికీ మూలమని పేర్కొన్నారు. కాగా, ఏఐ టూల్స్పై ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి సైతం ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చాట్జీపీటీ, బింగ్ ఏఐ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్తో మానవ ఉద్యోగాలకు ముప్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో తమ ఉద్యోగాలకు ఎసరుపెట్టుకునేందుకు ఏఐని మానవాళి అనుమతించదని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఇక ఏఐ టూల్స్ సహోద్యోగిలా ఉంటాయని, ఉద్యోగాలను లాగేసుకోవని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ పేర్కొన్నారు.
Read More :