న్యూఢిల్లీ: పదే పది నిమిషాలు. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి పట్టిన సమయం ఇంతే. బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఐపీఎల్ జనరల్ కౌన్సిల్కు కాల్ చేయడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీ కొనసాగించడం కుదరదని చెప్పడం నిమిషాల్లోనే జరిగిపోయింది. మంగళవారం అనూహ్య పరిస్థితుల్లో ఐపీఎల్ వాయిదా వేయడం వెనుక ఆ పది నిమిషాలు ఏం జరిగిందన్న దాని గురించి వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
బయో బబుల్లోకే వైరస్ చొరబడిన తర్వాత ఇక లీగ్ను కొనసాగించడం అసాధ్యమని ఐపీఎల్ జనరల్ కౌన్సిల్తో జే షా స్పష్టం చేశారు. ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని, అందులో రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే కౌన్సిల్లో ఓ సభ్యుడు మాత్రం లీగ్ కొనసాగాలని పట్టుబట్టినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. అయితే ఇతరులు దానికి ఆమోదం తెలపకపోవడంతో ఆ సభ్యుడు ఏమీ చేయలేకపోయారు. ముంబైతో మ్యాచ్కు ముందే సన్రైజర్స్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా కరోనా బారిన పడినట్లు తేలడంతో అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ లీగ్ను వాయిదా వేసింది.
అప్పటికప్పుడు ఒక నగరంలోనే అన్ని టీమ్స్కు బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యమని బీసీసీఐ భావించింది. బయో బబుల్లోకే వైరస్ చొరబడటంతో ఇక మా ముందు మరో మార్గం లేకపోయింది. రానున్న రోజుల్లో ఎంత మంది ప్లేయర్స్, కోచ్లు దీని బారిన పడతారో అన్న ఆందోళన కలిగింది. దీంతో టోర్నీని వాయిదా వేశాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా లీగ్ను వాయిదా వేయడం తప్ప తమ ముందు మరో మార్గం లేకపోయిందని చెప్పారు. అందరం మాట్లాడుకొని లీగ్ను వాయిదా వేయాలని నిర్ణయించామని అన్నారు.
మిగిలిన మ్యాచ్లు ఎప్పుడు?
ప్రస్తుతానికి దీనికి స్పష్టమైన సమాధానమైతే లేదు. ఈ నెలలో మాత్రం సాధ్యం కాదని లీగ్ను వాయిదా వేసే సమయంలోనే బోర్డు స్పష్టం చేసింది. రానున్న నెలల్లో ఖాళీ సమయం చూసి లీగ్లో మిగతా మ్యాచ్లను పూర్తి చేస్తామని మాత్రం చెప్పింది. ఆ మ్యాచ్లు కూడా యూఏఈలో జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దేశంలో కొవిడ్ పరిస్థితులను బట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.