ముంబై: రిలయెన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ప్రకటించారు ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్పై పని చేయనుంది. గతంలో జియోఫోన్, జియోఫోన్ 2 అనే రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసిన జియో.. తొలిసారి పూర్తి ఫీచర్లతో ఓ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వచ్చే వినాయక చవితి అంటే సెప్టెంబర్ 10 నుంచి మార్కెట్లోకి రానుందని అంబానీ వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్గానే జరిగిన ఏజీఎంలో ముకేశ్ ఈ ఫోన్ గురించి ప్రస్తావించారు.
గూగుల్, జియో టీమ్స్ కలిసి నిజంగానే ఓ బ్రేక్త్రూ స్మార్ట్ఫోన్ అయిన జియోఫోన్ నెక్ట్స్ను డెవలప్ చేశాయి అని అంబానీ చెప్పారు. గూగుల్, జియో అందించే అన్ని అప్లికేషన్లను ఇది సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఈ ఫోన్ కోసం ఆప్టిమైజ్ చేసిన ఓ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ వెర్షన్ను తమ టీమ్ తయారు చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ఇది కేవలం ఇండియన్ యూజర్ల కోసం అందులోనూ తొలిసారి స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్న వారి కోసం రూపొందించినట్లు పిచాయ్ తెలిపారు.