న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ల ప్రాబల్యం అధికమే కాకుండా పెద్దసంఖ్యలో యూజర్లు ఈ ఫోన్లను వాడుతుంటారు. లక్షలాది యూజర్లు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లతో తమ రోజువారీ టాస్క్లను చక్కబెడుతుంటారు. ఇక తాజాగా శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్లో లోటుపాట్లు బయటపడ్డాయి. ఈ లోపాలతో లోకల్ అటాకర్లు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్ల ఫోన్లలో అవాంఛనీయ యాప్ను ఇన్స్టాల్ చేసే వెసులుబాటు ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
భారత ప్రభుత్వం ఈ దిశగా యూజర్లను అప్రమత్తం చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఈఆర్టీ-ఇన్ శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్లో లోపాన్ని వెల్లడించింది. అటాకర్లు ఎంపిక చేసిన ఫోన్లలో అన్వాంటెడ్ యాప్ను ఇన్స్టాల్ చేయడం లేదా ఆర్బిటరీ కోడ్ను ఎగ్జిక్యూట్ చేసే వెసులుబాటు ఉందని శాంసంగ్ గెలాక్సీ యూజర్లను ప్రభుత్వం హెచ్చరించింది. 4.5.49.8కు ముందు శాంసంగ్ గెలాక్సీ స్టోర్ వెర్షన్ కలిగిఉన్న శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లకు ఈ ముప్పు పొంచిఉందని అప్రమత్తం చేసింది.
ఓల్డర్ వెర్షన్ యాప్ స్టోర్ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. గూగుల్ క్రోమ్లో హానికర హైపర్ లింక్ను క్లిక్ చేయడం లేదా ముందుగా ఇన్స్టాల్ చేసిన రోగ్ అప్లికేషన్ను ట్యాప్ చేస్తే అటాకర్ యూజర్ ఫోన్ను టార్గెట్ చేసి అన్వాంటెడ్ యాప్ను ఇన్స్టాల్ చేస్తారని యూజర్ల డేటా ప్రమాదంలో పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. శాంసంగ్ యూఆర్ఎల్ ఫిల్టర్ కన్నుకప్పి లోకల్ అటాకర్ తన కంట్రోల్లోని డొమైన్కు వెబ్వ్యూ సెట్ చేస్తాడని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి రిస్క్లను తప్పించుకోవాలంటే శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.