హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒకేసభలో ఇద్దరు కూతుళ్లు.. ఒకరు మాజీ ప్రధానమంత్రి బిడ్డ కాగా, మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి కూతురు. దేశంలో ఇటువంటి అపురూప ఘట్టం మరెక్కడా ఉండదు. ఈ అరుదైన సందర్భానికి వేదిక తెలంగాణ శాసనమండలి కాబోతున్నది. టీఆర్ఎస్ పార్టీ ఆ అపూర్వ సన్నివేశాన్ని ఆవిష్కృతం చేసి అజరామర చరిత్రకు వారధి కట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానం నుంచి శనివారం విజయం సాధించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు ఎస్ వాణీదేవి, నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈ ఇద్దరూ శాసనమండలిలో కొలువుదీరడం విశేషం.